ఉత్తుత్తమ కథలు

నేను తెలుగు కథలు చదవటం మానేసి పదిహేనేళ్లు దాటిపోయింది. దాని వల్ల అవి రాసేవాళ్లకి పోయేదేమీ లేదనుకోండి. ఐతే, మానేసింది నేనొక్కడినేనైతే సమస్య లేదు. నాలాంటోళ్లు మరెందరో. దశాబ్దంగా పాఠకుల్లో పఠనాసక్తి తగ్గటానిక్కారణం?  ఇతర మాధ్యమాలకి ఆదరణ పెరగటం, లెక్కలేనన్ని టీవీ ఛానళ్లు పుట్టుకురావటం, గట్రా, గట్రా అనేవి చచ్చు సమాధానాలు. మన సాహిత్యంలో సరుకు తగ్గటం అసలు కారణం. కథలు ఆసక్తిగా చదివేవాళ్లకి కరువొచ్చినా ఇప్పటికీ ఏటేటా కుప్పలు తెప్పలుగా కథలు రాలిపడుతుండటం విశేషం. అంటే, కరువు పఠితలకే – రచయితలక్కాదు. మంది ఎక్కువై మజ్జిగ పలచనైపోయిందన్నమాట. ఎవరుబడితే వాళ్లు కథలు రాసేయటం, పత్రికలు మొహమాటాలకో మెహర్బానీలకో వాటిని అచ్చేయటం మూలాన మన కథల స్థాయి తగ్గిపోయింది. తమ జీవితాల్లో ఎదురైన సంఘటనలకీ సన్నివేశాలకీ మసాలా సెంటిమెంట్లు, మూస నీతులు జోడించి కథగా మలిచి నాలుగైదు పేజీలు గిలికేసి పత్రికలకి పంపే ధోరణి పెరిగిపోయింది. అస్తిత్వవాదాలు, ఆ వాదాలు, ఈ వాదాలు అంటూ బుద్ధున్నవాడెవడికీ అర్ధమవని భాషా పటాటోపంతో కథలొండేవాళ్లు పెట్రేగిపోయారు. ఈ బాపతు సాహిత్యాన్ని – రాజుగారి దేవతావస్త్రాలు కనబడలేదంటే ఎక్కడ లోకువైపోతామోననుకుంటూ – కథ రాసినోడికే  తెలీనన్ని అర్ధాలు లాగీ పీకీ ఆహా ఓహో అంటూ బాకాలూదే విమర్శనాగ్రేసరులు వీధికొకరు పుట్టుకొచ్చారు. ఈ ఒరవడి తెచ్చిన వరదలో పడి కథల్లో వైవిధ్యం, విభిన్నత అనేవి కొట్టుకుపోయాయి. కథకి సామాజిక ప్రయోజనం, సాంఘిక స్పృహ, సాంస్కృతిక పరమార్ధం వగైరా గుణాలేవేవో ఉండాలనే గిరి గీయబడింది. మొత్తమ్మీద, తెలుగు కథ రవీంద్రభారతిలోనూ, తెలుగు విశ్వవిద్యాలయంలోనూ శాలువా సభలకీ పిచ్చాపాటీ సమావేశాలకీ మాత్రమే పరిమితమైపోయింది. సామాన్య ప్రజానీకానికి సుదూరమైపోయింది.

సమకాలీన తెలుగు కథల గురించి నేను మొత్తుకోవటం ఇదే మొదటిసారి కాదు. వాటిలో కరవైన వైవిధ్యాన్ని గురించి విమర్శించీ, చించీ విసుగెత్తి చివరాఖరికి ‘సరే, ఆ డిఫరెంటు కతలేవో నేనే రాసిపారేస్తే పోలా’ అనుకుని కథోద్దరణకి పాటు పడాలని డిసైడ్ చేసి ఆ విధంగా ముందుకు పోవటం మొదలెట్టి రమారమి రెండేళ్లయింది. అప్పట్నుండీ నా పాట్లేవో నేను పడుతూ ఓ పక్కన పడున్నోడిని చాన్నాళ్ల విరామం తర్వాత ఉన్నట్టుండి ఉరమటానికో తీరైన కారణముంది.

‘ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప కథలేవీ చదవనేకుండా, ఎప్పుడో రాతి యుగంలో నీకెదురైన చేదనుభవాల్ని ఇప్పటికీ గుర్తుంచుకుని తెలుగు కథల్లో సరుకే లేదని తీర్మానించేయటం అన్యాయం’ అని వాపోయే స్నేహితుడొకడి పుణ్యాన ‘సరే. నా అభిప్రాయం తప్పేమో. మార్చుకోటానికి ప్రయత్నిద్దాం ఛల్’ అనుకుంటూ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను. అదేమంటే, గత రెండు దశాబ్దాలుగా వచ్చిన ఉత్తమ కథల్ని చదివి తరించాలని. ఆ క్రమంలో చేతనైనన్ని కథా సంకలనాలు సంపాదించి తెలుగు కథపై నాకున్న దురభిప్రాయాన్ని సమూలంగా తొలగించే సదాశయంతో ఈ ఉగాదినాడు ఆ మహాకార్యానికి శ్రీకారం చుట్టాను. మహాకార్యం ముగిసేటప్పటికి వర్తమాన తెలుగు కథల స్థితికి – అదేదో సినిమా డైలాగులా చెప్పాలంటే – ముందు బాధేసింది, తర్వాత భయమేసింది, ఆ తర్వాత అసయ్యమేసింది. ఒట్టు తీసి గట్టు మీద పెట్టించిన స్నేహితుడి మీద పట్టరాని కోపం పుట్టుకొచ్చింది. దాన్ని వెళ్లగక్కటానికే ఈ టపా. చదివితే చదవండి.

అన్ని పుస్తకాల్లోనూ కలిపి రెండొందల యాభై దాకా కథలున్నాయి. ఇవన్నీ ఉత్తమ కథలుగా హేమాహేమీలు మెచ్చినవే. ఏ సంకలనంలోనైనా అందరికీ నచ్చే కథలే అన్నీ ఉండవు. ఆబోటి అమాంబాపతువి సగమున్నాయనుకున్నా తతిమ్మా నూట పాతికా మనల్ని మెప్పించాలి కదా. ఊఁహు. వీటిలో  నిఖార్సుగా గొప్పవనుకునేవి ఓ పాతికుంటాయేమో. మిగతా వందా ఏ కారణంతో ఉత్తమ కథలయ్యాయో నాకైతే అంతుబట్టలేదు. అన్నీ మూసకథలే. ఎంత మూస కథలంటే, గత ఇరవై ఏళ్లలో వచ్చిన ముప్పై మంచి కథల సంకలనం ఒకటి  – ఈ మధ్యనే విడుదలైంది. దాని ముందుమాటలో సంకలనకర్తల్లో ఒకరు ఇంచుమించు ఇలా వాపోయారు: ‘గడచిన ఐదేళ్లలో చెప్పుకోదగ్గ కథ ఒక్కటీ ఈ సంకలనానికి అర్హమైనది దొరకలేదు. మిగిలినవాటిలోనూ ఉన్నవి అధిక శాతం మూసకథలే. వాటిలోంచే మంచివి ఏరుకొని వేయాల్సొచ్చింది’. తప్పనిసరి తద్దినం నెత్తినేసుకున్న ఓ పెద్దాయన మొత్తుకోలది. ఉత్తమ కథలుగా చెలామణిలో ఉన్నవే ఇంత చెత్తగా ఉంటే, తతిమ్మావి ఇంకెంత దరిద్రంగా ఉంటాయో ఆలోచించండి. ప్రతి ఏటా వెయ్యికి పైగా తెలుగు కథలు చదివి వాటిలోంచి పదో పదిహేనో మంచివి ఎంపిక చేసే పని పెట్టుకున్న మహానుభావులు కొందరున్నారు. వాళ్ల ఓపిక్కి జోహార్లు చెప్పకుండా ఈ టపా రాయటం భావ్యం కాదు కాబట్టి, వాళ్ల ఓపిక్కి వేనవేల వందనాలు.

మహాకార్యంలో భాగంగా నే చదివిన కథలన్నిట్నీ దాదాపు నాలుగు చట్రాల్లో ఇరికించేయొచ్చు: రైతుల వెతలు, ఆడాళ్ల గోళ్లు (వేళ్లవి కాదు, వేరేవి), దళిత జనోద్ధరణ, జ్ఞాపకాల పునఃశ్చరణ. అటూ ఇటూ తిప్పి అన్నిట్లో ఉండేదీ ఆక్రోశం. అది ఆడ లేడీస్ గురించి కానీండి, రైతన్నల గురించి కానీండి, మరి దేని గురించి కానీండి …. అన్నింటా ఉండేది ఓ వర్గం మరో వర్గమ్మీద పడి ఏడవటం. ఇక్కడో విశేషం ఉంది. అదేంటో కానీ బడుగు రైతు గురించి కథ రాస్తే, దాన్సిగదరగ, అది ఏదో ఓ మాండలికంలో ఉండి తీరాల్సిందే (బైదవే, బడుగు రైతు బాధల మీద రాసేదే ఉత్తమ కథ. మోతుబర్ల మీదది కాదు. వాళ్లెప్పుడూ దోపిడీదార్లే. అలాగే అగ్రకులస్తులూను. ఈ రొటీన్‌కి భిన్నంగా రాస్తే అది కథ కాదు – ఆయా వర్గాల ఆధిపత్య ధోరణులకి నిలువుటద్దం). ‘రామయ్య పొలానికి వెళ్లాడు’ అంటే అది ఉత్తి కథే. ‘రామప్ప పొలానికి పూడ్సినాడు’ అంటేనే ఉత్తమ కథ! పోనీ ఆ మాండలికాలన్నా శుద్ధంగా ఉంటాయా అంటే అదీ లేదు. కడప యాసలో సంభాషణలు రాస్తూ ‘బతిమిలాడాడు’ అనేసే ఉత్తమ రచయితలు కూడా తగిలారు! ఉంటే కథంతా మాండలికంలో ఉండాలి, లేకుంటే సంభాషణలు మాండలికంలోనూ నెరేషన్ వ్యవహారికంలోనూ ఉండాలి. కొందరు రచయితలు ఈ రెంటినీ కలగాపులగం చేసి రాసిపారేయటం, అవి ఉత్తమ కథలుగా చెలామణవటం చూసి విస్తుపోవటం నా వంతయింది. ఉన్న చచ్చూ పుచ్చూ కథల్లోంచే మంచివి ఎంచుకోవాల్సిన దౌర్భాగ్యమన్న మాట.

మాండలికాలకి మరో వెసులుబాటూ ఉంది. యాసలో రాస్తే ఎంత కంపయినా ఇంపుగా, సొంపుగా ఉంటుందనేది నేటి తెలుగు సాహితీ విమర్శకుల నిశ్చితాభిప్రాయం కాబోలు. దీనికి నిదర్శనం – తన కథల్లో తల్లినీ చెల్లినీ సైతం లబక పదాలతో బూతులు తిట్టే ఒకానొక కథకుడి పైత్యంలో సదరు రచయితకి తన తల్లి/చెల్లిపై ఉన్న అవ్యాజానురాగాన్నే దర్శించగలిగే వీరి హృదయ వైశాల్యం. ‘సిత్తూరోడి కతలు’, ‘సంకనాకు సత్తిగా’ (పుస్తకం పేరు రోతగా ఉందా? ఆయన రచనలకన్నా కాదులెండి) వంటి ఆణిముత్యాలతో తెలుగు సాహితీవనంలో తిష్టవేసుక్కూర్చున్న మహారచయత ఆయన. ఆయన రాశాడు కాబట్టి చెల్లిపోయింది కానీ, మరే పిల్ల రచయితో పేజికో బూతు కూత రాస్తే అశ్లీలత పేరుతో బహిష్కరించేవాళ్లు. ఇక్కడ నీతి ఏమిటయ్యా అంటే, ఒకట్రెండు మంచి రచనల్తో గుర్తింపు తెచ్చుకున్నాక మాండలికాలనడ్డుపెట్టుకుని పాఠకుల నెత్తిన ఎంత గబ్బు కుమ్మరించినా చెల్లిపోతుంది.

చెత్త రాసినా చెల్లుబాటయ్యే గుణమున్న కేటగిరీ ఇంకోటీ ఉంది: ఆడాళ్ల వేళ్లవి కాక వేరే గోళ్లు. ఈ మధ్య కాలంలో స్త్రీ  స్వేఛ్చ పేరుతో ఏం రాసినా చప్పట్లు రాలుతున్నాయి. ఆ స్వేఛ్చ లైంగికతకి సంబంధించిందైతే నా సామిరంగా, ఇక తిరుగేలేదు. ఓ కథలో ప్రధాన పురుష పాత్ర వివాహేతర సంబంధం కలిగుంటే అతనో దుష్టుడు, దుర్మార్గుడు. అర్ధం చేసుకోదగ్గదే. ఐతే, అలాంటిదే మరో కథలో నాయిక అటువంటి సంబంధమే నెరిపితే అది మాత్రం యుగ యుగాలుగా స్త్రీ జాతికి వేయబడ్డ సంకెళ్లు, తరాలుగా విధించబడ్డ బంధనాలు, ఎట్‌సెట్‌రా, ఎట్‌సెట్‌రా తెంచుకుని, మదమెక్కిన మగజాతికి చెంపపెట్టుగా నిలిచి ఆకాశంలో సగమున్న ఆడజాతి శిరోభూషణమై వెలిగిన  వీరనారీమణి ధీర గాధ. ఉత్తమోత్తమ రచన! ‘కొవ్వెక్కిన కన్నెపిల్ల తొలగించిన పైట కాదది, పురుషాధిక్య ప్రపంచమ్మీద ఎగరేసిన తిరుగుబాటు బావుటా’ లాంటి విశేషణాలతో నాసిరకం రచనల్ని సైతం మోసిపారేసే విశ్లేషకుల పుణ్యాన స్త్రీవాదం అంటే విచ్చలవిడితనం అన్న అర్ధం సాధారణ పాఠకుల్లో జీర్ణించుకుపోయింది. అమ్మాయి తాగి తందనాలాడినా, తగువులు పెట్టుకున్నా, ఎన్ని వెధవ్వేషాలేసినా దానికేదో ఓ దిక్కుమాలిన సమర్ధన చూపి సమాజ రీతుల్ని ప్రశ్నిస్తూ కథ ముగిస్తే చాలు – అది కథ కాదన్నోడు వెధవ, ఉత్తమ కథ కాదన్నోడు కత్తితో నరకబడుదుడు. ఆమెన్.

ఇక, ఈ ఉత్తమ కథల్లో ఎన్నారై కథకులవి కూడా చాలా ఉన్నాయి. వీటిలోనూ ఓ విశేషం ఉంది. (ఏదో మాట వరసకన్నా కానీ, నిజానికి విశేషమేమీ లేదక్కడ). ఎన్నారై కథకులంటే అవి అమెరికాలో – కాకపోతే ఆస్ట్రేలియాలో, లేకపోతే ఆఫ్రికాలో … ఏదో ఓ పరదేశంలో – ఉండే ఎన్నారై జీవిత గాధే అయ్యుండాలనే నియమం ఏదన్నా ఉండి తగలడిందో ఏం పాడో కానీ, వీళ్ల కథల్లో నూటికి తొంభై అలాంటివే. విదేశాల్లో జీవితాలకీ, ఇండియాలో జీవితాలకీ ఉండే తేడాలు ఎత్తి చూపి చివర్లో హమారా భారత్ అదుర్స్ , బయటి దేశాల్లో బతుకులు ఏడ్సినట్టుండున్ అని ముక్తాయిస్తే పొగడ్తలు ఖాయం.

ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతౌతుంది. ఎటు తిప్పి ఏం చెప్పినా నా గోలొక్కటే. కథలకి సాంఘిక ప్రయోజనం ఉండటం మంచిదే. ఐతే ఆ వంకతో అన్నీ నీతి కథలే రాసిపారేస్తే తెలుగు కథల పరిధి పెరిగేదెలా? ఆంగ్ల సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహారచయితల రచనలు చూడండి. మామ్, లండన్, డాయల్, పో, స్టెయిన్‌బెక్, ఫిట్జ్‌జెరాల్డ్ …. ఎవర్ని తీసుకున్నా వారి కథల్లో లోతెక్కువ, నీతులు తక్కువ. అక్కడా యాసలున్నాయి. బూతులే లేవు. ఆయా కథల్లో వస్తు వైవిధ్యమూ ఎక్కువే. విడివిడిగా చూస్తే  వీళ్లలో ఒక్కో రచయితా ఒక్కో మూసలో కథలు రాసినట్లున్నా, ఎవరి మూస వారికుంది. మనకి లేనిదదే. ఇక్కడ సోది జాస్తి, సృజన నాస్తి. అందరూ కలిసి రాసేది నాలుగైదు మూసల్లోనేనా? కనీసం కొత్త మూసలన్నా తయారు చేయొచ్చు కదా.

52 స్పందనలు to “ఉత్తుత్తమ కథలు”


  1. 1 KumarN 5:33 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    — ‘కొవ్వెక్కిన కన్నెపిల్ల తొలగించిన పైట కాదది, పురుషాధిక్య ప్రపంచమ్మీద ఎగరేసిన తిరుగుబాటు బావుటా’

    హ హ హ అదిరింది..నాకు భలే నచ్చింది..మీరు మరీనూ, చాంధసులు, ఎం సి పి లూ 😉

    –“విదేశాల్లో జీవితాలకీ, ఇండియాలో జీవితాలకీ ఉండే తేడాలు ఎత్తి చూపి చివర్లో హమారా భారత్ అదుర్స్ , బయటి దేశాల్లో బతుకులు ఏడ్సినట్టుండున్ అని ముక్తాయిస్తే పొగడ్తలు ఖాయం”

    అంతేనండీ, మీరు డాలర్లకి ఆత్మనమ్మేసుకుని, ఆ దేశం కెళితే అలాగే కనపడుతుంది.. మీకేమర్ధమవుతాయ్ చేప్పండీడీడీడీ. 😉

    (You know what I meant right 😉
    నోస్టాల్జియా కథలతో చెడుగుడు ఆడుకుంటున్నారు జనాలు!!!.

  2. 2 Rao Lakkaraaju 6:19 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    ఇష్టం లో కష్టం పెట్టి 250 ఉత్తమ కధలు చదివారంటే గట్టి వారే. రివ్యు బాగుంది.

  3. 4 కోడీహళ్లి మురళీమోహన్ 6:33 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    వీటిలో నిఖార్సుగా గొప్పవనుకునేవి ఓ పాతికుంటాయేమో.

    కనీసం పాతిక కథలయినా మీకు గొప్పగా అనిపించాయంటే సంతోషించదగ్గ విషయమే మరి 🙂

  4. 5 కత్తి మహేష్ కుమార్ 7:51 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    ‘కథలు బాగా మనసుని పిండి వేసేవిగా ఉండకూడదు. హాస్యంగా అలా చదువుకు పోయేటట్లు ఉండాలి. మనసుని ఆహ్లాదపరుస్తూ, ఆలోచన రేకెత్తించేలా ఉండాలి. అలాగే సాహిత్యం కలకాలం నిలిచి పోయేదిగా ఉండాలన్నా నాకర్థం కాదు. నేను రాసే కథలు ఈ తరానికి చెందినవి. తరతరాలుగా నిలబడాలని ఎలా ఆశిస్తాను?’.- ముళ్ళపూడి రమణ

  5. 6 Sravya V 8:06 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    ఈ మధ్యన ఇటుకేసి రాకుండా కథలు చదివే మహాకార్యం లో మునిగిపోయరన్న మాట !
    Post is too good !

  6. 7 saamaanyudu 8:14 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    ఓ మంచి కథా విశ్లేషణ చదివించినందుకు మహేష్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుచేతనంటే ఇది ఫేస్ బుక్ లో ఏడ్ చేసారాయన..
    తెలుగు కథల పరిథి విస్తరించాలన్న మీ కోరిక అభినందనీయం.. మనందరి తెలు ‘గోడు’ కథకులకు, ప్రచురణకర్తలకు చేరాలని ఆశ…

  7. 8 kasturimuralikrishna 8:17 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    అబ్రకదబ్ర గారూ

    మీకు సంకలనాలలో మూస కథలే దొరుకుతాయి. మంచి కథలు పత్రికల గుట్టలలో మామూలు కథల క్రింద ఎక్కడో నలుగుతూంటాయి. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో సాహిత్య మాఫియా ముఠాల కాలం నడుస్తోంది. సంకలనాలలో కథలు ఎంపిక అవటం వెనుక మతలబుల గురించి, ఎలాంటి కథలు, ఎవరి కథలు ఎంపిక అవుతాయో నేను అవకాశం దొరికినప్పుడల్లా రాస్తున్నాను. ఇటీవలె ఆంధ్రభూమిలో ఈ సంకలనాల వల్ల జరుగుతున్న అన్యాయమూ రాశాను. నా వెబ్ సైట్ లో వుందా వ్యాసం. వీలయితే చదవండి. టూకీగా చెప్పాలంటే సంకలనాలలో కథ రావాలంటే రచయితకు ప్రతిభ అవసరంలేదు. రచయిత, సంకలనకర్తల స్నేహితుడో కావాల్సినవాడో కావాలి, విప్లవ ఉద్యమాలలో వుండాలి, ఉన్నతోద్యోగి అయివుండాలి, లేకపోతే జర్నలిస్టయినా అయివుండాలి. నా వ్యాసం లో ఈ విషయాన్ని వివరించాను. ఇంకా నిరూపణ కావాలంటే ఇటీవలె పాలపిట్ట వారు సంకలనం చేసిన పుస్తకం చూడండి. 186 కథకుల నుంచి కథలను ఆహ్వానించి వాటిలోంచి వారు ఎన్నుకున్న కథలు కథకులను చూస్తే నేనన్నట్టు ఈనాటి కథల సంకలనాలు దమయంతీస్వయంవరాలన్నది స్పష్టమవుతుంది.

  8. 9 సుజాత 9:00 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    ఇండియాలో జీవితాలకీ ఉండే తేడాలు ఎత్తి చూపి చివర్లో హమారా భారత్ అదుర్స్ , బయటి దేశాల్లో బతుకులు ఏడ్సినట్టుండున్ అని ముక్తాయిస్తే పొగడ్తలు ఖాయం.___________

    అవును, నిజం!

    మొత్తానికి మీ ఇండియా ట్రిప్ లో మీకు జ్ఞానోదయం బాగానే అయిందన్నమాట. మీది ధర్మాగ్రహమే!

    కొంతమంది ఎప్పుడూ పాత కథలూ నవలలూ అంటూ వాటిని పట్టుకుని వేళ్ళాడుతుంటారు అని నాకు ఒకమ్మాయి అక్షింతలు వేసిందా మధ్య! 🙂

  9. 10 ideesangati 9:01 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    మీరు మంచి కథలు చదావాలనుకుంటే ఎవరో ఏరు కొచ్చిన సంకలనాలు కాదేమో చూడాల్సింది!
    మట్టిలో మాణిక్యాల్లా ఎక్కడో దాగివున్నవి వెలికి తీయాలి మీ అభిరుచికి తగినట్టు….

  10. 11 cbrao 10:18 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    ఇండియా వచ్చి వెళ్లారా? మీరెలాంటి కధలు రావాలని కోరుకున్నారో లేక మీకు నచ్చిన కధల గురించిన వివరాలెంచేతో మీరివ్వలేదు. ఆ వివరాలతో ఈ వ్యాసానికి భాగం -2 వ్రాస్తే, ఈ వ్యాసానికి ముగింపు ఉంటుంది. అందాక ఇది అసంపూర్ణమే. వీలైతే, మీకు నచ్చిన వైవిధ్యమైన కధలతో ఒక సంపుటాన్ని ప్రచురించండి.

    • 12 అబ్రకదబ్ర 5:55 సా. వద్ద ఏప్రిల్ 25, 2011

      నాకు నచ్చే కథలంటే .. చాలా కాకపోయినా కొన్ని లక్షణాలుండాలి (ఇవన్నీ – వస్తువు, కథనం, శైలి, భాష ఇత్యాది ఇతర మంచి ‘చదివించే’ గుణాలకి తోడుగానన్న మాట)

      ఒకటి: కథ మొదటి పేరా చదవగానే (ఇంకా ఘోరంగా, పేరు చదవగానే) చివర్లో ఏమౌతుందో తెలిసిపోకూడదు.

      రెండు: కథలో పాత్రలు లేదా సంఘటనలు ఇంతకు ముందెక్కడో చూసినట్లుండకూడదు. మరోలా చెప్పాలంటే, కథ చదివితే నా పాత డైరీలు తిరిగేస్తున్నట్లుండకూడదు. అది హాస్యకథైతే ఈ నియమం వర్తించదు కానీ భావోద్వేగాల కథైతే మాత్రం నేనెరిగిన సంగతులే కథల్లో చదవాలంటే బోర్.

      మూడు: కథలో అనవసరమైన సోది ఉండకూడదు. పదాలని పొదుపుగా వాడమని దీనర్ధం కాదు. అవి అవసరం మేరా వాడాల్సిందే. కానీ చిట్టి కథల్లో రాసే ప్రతి వాక్యమూ కథకి కీలకమై ఉండాలి. ప్రతి వాక్యానికీ ఓ పరమార్ధం ఉండాలి. పేరాలకు పేరాలే ఎత్తేసినా కథ శుభ్రంగా అర్ధమవుతుందంటే, నా దృష్టిలో అది కథే కాదు.

      పైలక్షణాలున్న ఏ కథైనా నాకు నచ్చుతుంది. వీటికి తోడు ఈ క్రిందివీ ఉంటే మరింత నచ్చుతుంది.

      నాలుగు: కథ ముగింపు ఊహాతీతంగా ఉండాలి. ముగింపు ఆ రకంగా ఉండబోతుందనేదానికి కథ నిండా కావలసినన్ని క్లూస్ ఉండాలి. రెండోసారి కథ చదివినప్పుడు అవన్నీ అర్ధమై ‘అర్రె. ఇది ముందే గమనించలేకపోయానే’ అనుకునేలా ఉండాలి.

      ఐదు: కథలన్నీ closed-endedగానే ఉండనవసరం లేదు. ముగింపు పాఠకుల ఊహకే వదిలేసే రకం కథలూ నచ్చుతాయి. కాకపోతే అది ముగింపెలా ఇవ్వాలో రచయితకే తెలీని గందరగోళం నుండి కాక, నాలుగైదు ముగింపులు సాధ్యమయ్యే తెలివైన కథనం నుండి వచ్చినదై ఉండాలి.

      ఆరు: కథ చదవటం వల్ల పాఠకుడు అంతకు ముందు తెలీని కొత్త విషయం ఏదో ఒకటి తెలుసుకోవాలి.

      వీటిలో మొదటి మూడూ నేను చదివే కథలకు ఉంటే చాలు, నాకా కథ నచ్చుతుంది. ఆ మూడిటితో పాటు చివరి మూడు గుణాలు కూడా ఉండే కథలు రాయటం నాకిష్టం.

      ఈ గుణాలుండేవి ఉత్తమ కథలు కావచ్చు, కాకపోవచ్చు. నాకు మాత్రం ఎక్కువగా ఇలాంటివి నచ్చుతాయి. ఇలాంటివి మాత్రమే నచ్చుతాయని కాదు. ఒక్కొక్కప్పుడు ఇతర గుణాలున్నవీ నచ్చొచ్చు.

  11. 13 nagamurali 10:59 సా. వద్ద ఏప్రిల్ 20, 2011

    మీ శైలిలో – అంటే చాలా బాగా – పచ్చి నిజాలు చెప్పారు.

  12. 14 Snkr 12:26 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2011

    / వారి కథల్లో లోతెక్కువ, నీతులు తక్కువ./

    అలా వుంటే “రచయిత సమాజానికిచ్చే సందేశం ఏమిటి? ఏదో లోతుగా రాస్తే కాదు, ఎవడిక్కావాలి లోతు? మునిగి చావడానికా?” అని విమర్శకులు అంటేనో? 🙂

    /ఎవరి మూస వారికుంది. మనకి లేనిదదే. ఇక్కడ సోది జాస్తి, సృజన నాస్తి. అందరూ కలిసి రాసేది నాలుగైదు మూసల్లోనేనా? కనీసం కొత్త మూసలన్నా తయారు చేయొచ్చు కదా./

    ‘ఆ ఎప్పుడూ ఒకటే మూస, ఒకే మూసలో పోసిన కథలు, విసుగెత్తి పోయింది. రచనల్లో వైవిధ్య మేది?! ఎప్పుడూ ఒహటే టైపు, దాసరి నారాయణరావు సినిమాలా.& ‘ అంటూ ‘ ఆ.. అవి భక్ష్యాలు. ఆ.. ఇవి బొబ్బట్లు, .. అసలైనది ఏది? ఏది?!’ అని మాయాబజార్లో అన్నట్లు, మీరనరని గ్యారంటీ ఏమ్హిటి?
    ‘అంతే, మనోళ్ళు రాస్తే ప్రోత్సాహమివ్వరు, అదే ఏ నాయనోయ్/బాబోయ్ లాంటి రష్యన్ పేర్లు పెడితేనా .. ఎగబడి చదువుతారు. దేశభక్తి లేదు వెధవలకీ అని కూడా ఇక్కడే కొంతమంది బ్లాగర్లు తిట్టేస్తారు. 🙂

  13. 15 కన్నగాడు 1:45 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2011

    Road going రోశయ్య చెప్పాడని 250 కథలు చదివారా! మీ ఓపికకు ఒక ‘ఓహో’. అందులో మాకు సిఫారసు చేయగలిగేవి ఏమైనా ఉన్నాయా?
    చాలారోజుల తరువాత కనిపించారు, ఏమైనా కొత్త కథలు రాసారా.

    • 16 అబ్రకదబ్ర 12:23 సా. వద్ద ఏప్రిల్ 22, 2011

      నాకు నచ్చిన వాటిలో బి.అజయ్ ప్రసాద్ ‘జాగరణ’, కేతు విశ్వనాధ రెడ్డి కథొకటి (పేరు ‘అమ్మోరు నవ్వింది’ అనో, ఏదో), పేరు గుర్తులేని రచయితెవరో రాసింది ‘గాంధీగిరి’ అనే హాస్య కథొకటి .. ఇంకొన్నున్నాయి. వివరాలు గుర్తు పెట్టుకోటంలో నేను చాలా వీక్. ఆ పుస్తకాలోసారి తిరగేసి మరిన్ని వివరాలిస్తాను.

      ఉప్పిగాడేమయ్యాడు? మళ్లీ ఎప్పుడొస్తాడు?

  14. 18 అరిపిరాల సత్యప్రసాద్ 2:14 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2011

    మీ “గోడు” బాగుంది. మీరు చెప్పిన కథా సంకలనాలలో చాలా వరకు వివిధ కథల పోటీలలో వచ్చిన కథలు వుండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు వస్తున్న ప్రతి కథలపోటీ ఫలితాలలో తప్పక కనపడే మాట “రాశి ఎక్కువ వాసి తక్కువ” అని. అప్పుడు మీరన్నట్టు తప్పక తద్దినం పెట్టినట్టు, తప్పక రెండు మూడు కథలకు బహుమతి మొత్తం పంచుతున్నారు. ఇంతా ఆ కథలు చదివితే ఏ మాత్రం నిబద్దత లేని రచయిత వ్రాసిన కథలు బయటపడతాయి. ఈ మధ్య సంక్రాంతి పోటీలలో వచ్చిన బహుమతి కథలలో – అనవసర ఇంగ్లీషు పదాలు (బెడ్, బ్లాంకెట్ లాంటివి) వాడిన కథ ఒకటి, ప్రధాన పాత్ర పేరు మధ్యలో మర్చిపోయి వేరే పేరు వాడేసిన కథ, అచ్చుతప్పులు వున్న కథ వున్నాయి. ఇదంతా చూస్తే ఈ కథలను ఎన్నుకునే వారి నిబద్దత మీద కూడా అనుమానాలు వస్తాయి. ప్రపంచ కథలలో కొత్త కొత్త జాన్రాలు, కొత్త కొత్త శైలులు పుట్టుకొస్తున్నా మన కథలకి ఇంకా ఆ భాగ్యం దక్కలేదు. అబ్సర్డ్ కథలు, సర్రీయలిజమ్ కథలు ఎన్ని వున్నాయి తెలుగులో?

    ఇవన్నీ ఒక ఎత్తైతే మరో విషయం ఏమిటంటే – కథకులు వ్రాసిన కథలకి బహుమతులు ఇస్తున్నారా లేక బహుమతి కోసం కథలు వ్రాస్తున్నారా అని. ప్రతి పత్రిక ప్రకటించే కథల పోటీ ఫలితాలు వరసగా గమనిస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఒకే రకం కథలకే బహుమతులు వస్తున్నాయని గమనించవచ్చు. ఇందులో కూడా పత్రిక పత్రికకి ఒక రోటీన్ లక్షణం వుంది. ఇది తెలిసిన రచయితలు ఫలానా పత్రికకి “ఆడవాళ్ళ గోళ్ళు” వ్రాస్తే బహుమతి గ్యారంటీ అనో, లేకపోతే “రైతులగోడు” వ్రాసాను కాబట్టి ఫలానా పత్రికకే పంపిస్తాననో అనడం సర్వసాధారణ అయిపోయింది. ఈ పరిస్థితిలో తెలుగులో “మంచి కథలు” వస్తాయని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఆ రకంగా చూస్తే ఇంటర్నెట్ లొ వస్తున్న చాలా కథలు ఇంకా గుర్తింపుకి నోచుకోని గొప్ప కథలని నా అభిప్రాయం.

  15. 19 రవి 9:39 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2011

    >>ఆంగ్ల సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహారచయితల రచనలు చూడండి. మామ్, లండన్, >>డాయల్, పో, స్టెయిన్‌బెక్, ఫిట్జ్‌జెరాల్డ్ …. ఎవర్ని తీసుకున్నా వారి కథల్లో లోతెక్కువ, నీతులు >>తక్కువ. అక్కడా యాసలున్నాయి. బూతులే లేవు. ఆయా కథల్లో వస్తు వైవిధ్యమూ ఎక్కువే. >>విడివిడిగా చూస్తే వీళ్లలో ఒక్కో రచయితా ఒక్కో మూసలో కథలు రాసినట్లున్నా, ఎవరి మూస >>వారికుంది. మనకి లేనిదదే.

    మీరు సూచించిన ఆంగ్లరచయితలు ఎప్పటివారు? పో, స్టెయిన్బెక్ ల గురించి నాకు తెలియదు. మిగిలిన వాళ్ళు కనీసం మనం (మన తరం) పుట్టకముందు వారు. అవునా? వారితో ఈ మధ్యన రెండుదశాబ్దాల తెలుగు రచయితలతో పోల్చడం, అందునా మీరు చదివిన రచనలను ఎన్నుకొని పోల్చడం ఎంతవరకు సబబంటారు? ఆంగ్లసాహిత్యాన్ని పరిపుష్టం చేసిన రచయితలతో మీరు ఎన్నుకుని ’బూతు’ అని లేబుల్ వేసిన రచయితలను పోలుస్తున్నారు మీరు.

    మీకు వాళ్ళతో పోల్చడానికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పాలగుమ్మి వారు, మధురాంతకం రాజారాం, బాలగంగాధర తిలక్, మల్లాది రామకృష్ణశాస్త్రి, భరాగో, ముళ్ళపూడి వెంకటరమణ, అవసరాల రామకృష్ణారావు, శంకరమంచి సత్యం, శ్రీరమణ ……ఇలాంటి వాళ్ళెవరూ కనిపించలేదాండి?

    • 20 అబ్రకదబ్ర 3:03 సా. వద్ద ఏప్రిల్ 21, 2011

      పో, స్టెయిన్‌బెక్ సైతం గత తరాల ప్రతినిధులే.

      నా గోడంతా గత రెండు దశాబ్దాల తెలుగు కథల గురించే. ఆ విషయం నా టపాలో స్పష్టంగానే ఉంది కదా. పాతవారిని నేనేమీ తీసిపారేయటం లేదు. ఇప్పుడూ కేతు విశ్వనాధరెడ్డి వంటివారు ఒకరిద్దరున్నారు – గత తరాలకి వారధిగా. కానీ ఇలాంటి ఘనాపాటీలు సైతం తెలుగు కథల్ని కొత్త పుంతలు తొక్కించిందేమీ లేదు – అది నా అభిప్రాయం.

      మీరుదహరించిన పాలగుమ్మి పద్మరాజు, తిలక్, మధురాంతకం రాజారాం, శంకరమంచి సత్యం మొదలగు ప్రసిద్ధ రచయితల పేర్లు విన్నాను కానీ వాళ్ల సాహిత్యం (ఒకటీ అరా తప్ప) నేను చదివింది లేదు. చదివే అవకాశం రాలేదనాలి. కాబట్టి వాళ్ల రచనల గురించి వ్యాఖ్యానించటం, వాళ్లతో నేటి తరం తెలుగు రచయితల్ని పోల్చటం నేను చెయ్యలేను. (వారిలో కొందరి కథల సంపుటాలు ఈ మధ్యనే సంపాదించాను. తీరిగ్గా చదవాలి)

      మీరు మళ్లీ అడగొచ్చు: ‘వర్తమాన తెలుగు రచయితల్ని వర్తమాన ఆంగ్ల రచయితలతో పోల్చకుండా ఎప్పటివారితోనో పోల్చటం ఎందుకు?’. ఎందుకంటే – నేనుదహరించిన రచయితలు ప్రసిద్ధులు కాబట్టి, వాళ్ల రచనలు (నా టపాలు చదివేవారిలో) అధికులు చదివి ఉండే అవకాశం ఉంది కాబట్టి.

      కొత్త, పాత సంగతి పక్కన పెట్టండి. తెలుగు సాహిత్యంలో అడ్వెంచర్, సస్పెన్స్, హారర్, సై-ఫై, అధివాస్తవికత, అపరాధ పరిశోధన, ఫ్యాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్ … వగైరా విభాగాల్లో – కొమ్మూరి, ఆరుద్ర, నంది వంటి వారు అక్కడొకటీ ఇక్కడొకటీ రాసినవి తప్ప – ఎన్ని వందల చెప్పుకోదగ్గ కథలొచ్చాయి? అందరు కథకులూ బండి లాగించింది భావోద్వేగాలనడ్డుపెట్టుకునే కాదా? రచయితల జీవితాల్లో ఎదురయ్యే ఘటనలకి కాస్త సెంటిమెంటు, కాసిని సూక్తులు జోడించి డాక్యుమెంట్ చెయ్యటం తప్ప సాహిత్యానికి మరో పరమావధి లేదా? ఫిక్షన్ అంటే మన డైరీల్లో పేజీలు చింపుకొచ్చి వ్యక్తుల పేర్లు మార్చి ఫ్రెష్ పేపర్ల మీద రాయటమా? (పూర్వమేమో కానీ, ప్రస్తుతం నూటికి తొంభైమంది రచయితలు/త్రులు చేస్తుందదే). ఇందులో క్రియేటివిటీ ఏముంది? రిక్షా కార్మికుడి శ్రమదోపిడి, బక్క రైతు బాధలు, పక్కింట్లో కోడిపుంజు తప్పిపోయిన వైనం, (ఎవరో ఇంతకు ముందు నా బ్లాగులోనే అన్నట్టు) పెరట్లో చెట్టు కొట్టేయటం .. ఇంకెంత కాలమండీ ఇలాంటి తలమాసిన ఇతివృత్తాలతో కథలు? సాహిత్యానికి ఇంత చిన్న పరిధా! కాలం మారింది. మన కథల గొంగళి మాత్రం పూర్వీకులు వేసిపోయిన చోటే ఉంది. రాతగాళ్ల శైలి మారిందేమో కానీ, తెలుగు కథల రాత మాత్రం ఇంకా మారలేదు.

  16. 21 రవి 10:34 సా. వద్ద ఏప్రిల్ 21, 2011

    తెలుగు కథాసాహిత్యానికి పరిధి చిన్నది. మీరన్న మూసకొట్టుడు కథల విషయం నిజమే అయినా, ప్రపంచ కథాసాహిత్యంతో పోల్చే స్థాయి ఒక ప్రాంతీయభాషకు లేదని నా అభిప్రాయం. అలా ఉంచితే తెలుగులో కథలు చదివే పాఠకులు 90 ల వరకూ ముఖ్యంగా స్త్రీలు మాత్రమే. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని మేగజైనులు నడుస్తున్నప్పుడు ఫేంటసీలు, హారర్, సై ఫై, లు వచ్చే అవకాశం లేదు. అయినా కొమ్మూరి వేణుగోపాలరావు, ఎన్ ఆర్ నంది, మైనంపాటి భాస్కర్, మల్లాది వంటి వారు నవలల ద్వారా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇంకా కొన్ని అలాంటి ప్రయత్నాలు.

    అపరాధపరిశోధన : ఈ పేరు మీదనే ఒక పత్రిక 80 లలో వచ్చి ఎన్నో యేళ్ళు నడిచింది. అపన అనేవారు. ఇప్పుడా పుస్తకాలు దొరికే అవకాశం లేదు. మల్లాది వెంకటకృష్ణమూర్తి (సముద్రపు దొంగలు, నత్తలొస్తున్నాయి జాగ్రత్త వగైరా) కూడా అందులో కథలు రాశారు. అప్పట్లో ఆ పత్రిక మార్కెట్ లో హాట్ కేక్.

    అడ్వెంచర్స్ మీద షాడో మధుబాబు పుస్తకాలు బోల్డు. ఇవి కథలు కాదు, చిట్టి నవలలు అనుకోండి. తెలుగు తప్ప అన్య భారతీయ భాషల్లో ఇలాంటి పుస్తకాలు వచ్చి ఉండవని నా నమ్మకం.

    అయితే ఈ రెండు దశాబ్దాలలో మాత్రం కథ అంటేనే చిరాకు పుట్టే పరిస్థితి వచ్చింది మీరన్నట్టు. మొన్నామధ్య ఆంధ్రజ్యోతి ప్రత్యేకసంచిక వచ్చింది. ఒకటీ అరా తప్ప దాదాపు అన్నీ నోస్టాల్జియా కథలే.

  17. 23 kasturimuralikrishna 3:38 ఉద. వద్ద ఏప్రిల్ 22, 2011

    అబ్రకదబ్ర గారూ, రవి గారూ
    మీ చర్చలో అనవసరంగా జోక్యం చేసుకుని కొన్ని కోతలు నా రాతల గురించి కోస్తున్నాను. క్షమించండి.
    మీరన్నట్టు రచయితలు విభిన్న ప్రక్రియలలో రచనలు చేయటంలేదు. ఎందుకని?
    రచయితలేకాదు ఏ కళాకారుడయినా పొగడ్తలు, గుర్తింపులు కోరతాడు. ఎలాంటి రచనలకు అవి లభిస్తాయో అందరూ అలాంటి రచనలు చేయాలని అనుకుంటారు.
    తెలుగులో అదే జరుగుతోంది.

    విమర్శకులు రచయితలను నిర్దేశిస్తున్నారు. నిజానికి విమర్శకులపని రచయితల రచనలను విశ్లేషించటమే. కానీ తెలుగులో విమర్శకులు రచయితలకన్నా శక్తిమంతులు. వీరికి సంస్థలున్నాయి. వారు పొగిడే రచనలు సంకలనాలుగా ప్రచురించే ముఠాలున్నాయి. దాంతో పాఠకులతో సంబంధం లేకుండా విమర్శకులు, రచయితలు ఒకరినొకరు సంతృప్తి పరచుకుంటున్నారు.

    మీరు వైవిధ్యభరితమయిన రచనలు, ముఖ్యంగా, కథలు, నవలలు రావటంలేదంటున్నారు. అలా వచ్చినవాటిని విమర్శకులు పట్టించుకోరు. ఎవరూ వాటి గురించి ప్రస్తావించరు. so they appear to die a natural death, when in fact they are killed deliberately

    మీరు రాజతరంగిణి కథలు చదివారా? తెలుగులో హిస్టారికల్ ఫిక్షన్ కథలవి.
    జీవితం-జాతకం కథలు చదివారా? జ్యోతిష శాస్త్రాం ఆధారంగా వ్యక్తిత్వ వికాసం, పాసిటివ్ థింకింగ్ చూపే కథలవి. ష్ర్లాక్ హోంస్ లా ఒక పాత్ర కథలను డాక్టర్ వాట్సన్ లా చెప్పే కథలవి.
    రియల్ స్టోరీస్ చదివారా? నిజ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అర్ధవంతమయిన జీవితాన్ని గడిపిన ఆదర్శవంతులన వ్యక్తుల కథలవి.
    సైన్స్ ఫిక్షన్ కథలు చదివారా? తెలుగులో అరుదుగా వచ్చినauthentic science fiction stories అవి.
    మీరు అతిరాత్ర, మర్మయోగం, పునసృష్టికి పురిటి నొప్పులు వంటి నవలలు చదివారా?
    మీరు నవ్యలో వచ్చిన హారర్ కథలు చదివారా? అవి ఆ పత్రికలో అర్ధాంతరంగా ఆగిపోయాయి కానీ, వాటికి లభించిన ఆదరణ చూసి ఇప్పుడొక పత్రిక హారర్ కతహల పోటీ నిర్వహిస్తోంది. ఆ పత్రికలో త్వరలో నేనొక హారర్ నవల రాయబోతున్నాను.
    పైన నేను ఉదాహరించిన వన్నీ నేను రాసినవే. వాటి గురించి మీరు ఎక్కడా చదివివుండరు. అసలలాంటి రచనలున్నట్టు మీకు తెలిసివుండదు. ఎందుకంటే మన సాహిత్యమేదో నిర్దేశించే విమర్శకుల దృష్టిలో ఇదంతా సాహిత్యం కాదు. వీటిని గుర్తించరు. అందుకే రచయితలు ఇలాంటివి రాయరు. అందరూ నా అంత మొండిగా, మూర్ఖంగా, అహంకారంగా( ఆత్మవిశ్వాసం, పాఠకులపై నమ్మకము), పట్టుదలగా వుండరు. ఇన్ని కథలు నవలలు రాసినా నేను కతకుడినికాను మనవారి దృష్టిలో. ఎందుకంటే నేను వారు నిర్ణయించిన అర్హతల పరిథిలో లేను కాబట్టి. కాబట్టి ప్రస్తుత తెలుగు సాహిత్యం గురించి తెలియాలంటే మీరు కథల సంకలనాలు కాదు, రచయితలు వ్యక్తిగతంగా ప్రచురించుకున్న కథల సంకలనాలు చదవండి. కొన్ని అద్భుతమయిన సంకలనాలు, రచయితలు దొరుకుతారు.

    • 24 అబ్రకదబ్ర 11:53 ఉద. వద్ద ఏప్రిల్ 22, 2011

      మురళీకృష్ణ గారు,

      అనవసర జోక్యమేమీ లేదు. కొత్త విషయాలు, వివరాలు ఎన్నో తెలుస్తున్నాయి – కనీసం నాకు. అందించినందుకు ధన్యవాదాలు.

      ఐతే, అందరు విమర్శకులూ, సంకలనకర్తలూ మీరన్న తానులోకి వచ్చేవాళ్లుండరనేది నా అనుభవం. వాళ్లకున్న పరిధుల్లోనే నిజాయితీగా సాహితీ సేవ చేసేవాళ్లూ ఉన్నారు. కథనరంగానికి నేనింకా చాలా కొత్తవాడిని. మీకున్నంత అనుభవం లేదు. ఈ దారి నాకు పూర్తిగా కొత్త. అయినా ఇప్పటిదాకా అందులో నా ప్రయాణం సాఫీగా సాగింది. నేను రాసింది నాలుగే కథలు; వాటిలో అచ్చయింది మూడు. అవి గొప్పవా కాదా అన్న విషయం అవతల పెడితే కచ్చితంగా నేను విమర్శించే కేటగిరీలకి చెందినవైతే కాదు. పత్రికారంగంలో నాకున్న పరిచయాలు పూజ్యమైనా వాటిని అచ్చేయించుకోటానికి నేనే పాట్లూ పడలేదు. ఆ మూడిట్లో వివిధ సంకలనాలకెక్కినవీ రెండున్నాయి. ఇందాకే అన్నట్టు, అవి గొప్పవా కాదా అన్న విషయం అవతలుంచితే – కనీసం కొందరు సంపాదకులు, సంకలనకర్తలన్నా వైవిధ్యత ఉట్టిపడే కథల కోసం తపించేవాళ్లున్నారని అవి తెలియజెప్పాయి.

      సమస్య కథకుల్లో ఉందో, విమర్శకుల్లో ఉందో కానీ …. పాఠకుల్లో మాత్రం లేదు. పైన రవి గారి అభిప్రాయంతో (‘మహిళా పాఠకులు ఫ్యాంటసీ, హారర్ వగైరా ప్రయోగాలు హర్షించరు’) నేనేకీభవించను. అలా అని మహిళా పాఠకులెవరితోనన్నా చెప్పారా? ‘తులసిదళం’ వంటి నవలల్ని సూపర్‌హిట్స్‌గా మలచింది ఎనభైల్లోని పాఠకురాళ్లే కదా.

      నా అభిప్రాయం ఏమిటంటే, ఈ ‘వస్తు లేమి’ సమస్య నిజానికి రచయితల్లోనే మొదలయింది. ప్రచురణకర్తలు దాన్ని ఇంకొంచెం పెద్దది చేసి ఉండొచ్చుగాక. హ్యూమన్ ఎమోషన్లతో నిండిన కథలు రాయటం అతి తేలికైన విషయం (వాటిలో గొప్పవి రాయటం అంత తేలిక్కాదు – అది వేరే విషయం). ప్రతి ఒక్కరి జీవితంలోనూ కావాల్సినంత డ్రామా ఉంటుంది. వాటిలో ఏవో కొన్ని సంఘటనలు తీసుకునో, రెండు మూడిట్ని కలగలిపో ఓ కథగా మలచటం పూర్తి స్థాయి కాల్పనిక సాహిత్యం సృష్టించటంతో పోలిస్తే అతి సులువు. వర్తమాన కథకుల్లో అధికులు ఈ తేలిక మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఈ తరహా సాహిత్యం సృష్టించటానికి పెద్దగా పరిశోధనలు, పరిశీలనలు చెయ్యాల్సిన అవసరమూ లేదు. అదన్న మాట సంగతి.

  18. 25 Brahmanandam Gorti 9:57 ఉద. వద్ద ఏప్రిల్ 22, 2011

    మీ చర్చ కథా వస్తువుల పరంగా సాగుతోంది. కథకి వస్తువు ముఖ్యమే కానీ అదొక్కటే కథని నిలబెట్టదు. చదివించే గుణం కూడా ఉండాలి కదా? అప్పట్లో వారం వారం సీరియల్స్ వచ్చేవి. చివరి వరకూ వచ్చేసరికి ఒక చిన్న మెలిక పెట్టి వచ్చే వారం చూసుకోండి అనేవారు. దాదాపు ఇదే పరిస్థితి కథలకీ దాపురించింది. కథంటే మలుపులుండాలి;ముందు ముందు ఏం వస్తుందో ఊహకి అందకూడదు; ముగింపుండాలి;సందేశం ఉంటే మరీ మంచిది; నాలుగు పేజీలకి మించ కూడదు, వగైరాలతో ఒక మూసకి పాఠకుల్ని కట్టేసారు.

    రాసే శైలి కూడా ముఖ్యం. చివరి వరకూ చదివించగలగాలి. అన్నింటినీ మించి భాష మీద పట్టుండాలి. ఒంపుగా ఒద్దిగ్గా రాయగలగాలి. ఇలా అన్ని పాళ్ళూ సమంగా కలిస్తేనే రుచిగా ఉంటుంది. కథా వైవిధ్యం ఆయా పత్రికల సంపాదకుల అభిరుచిని బట్టికూడా ఉంటుంది. ఒక పత్రిక్కి నచ్చిన కథ, మరో దానికి పనికి రాదు.

    అయినా కథా ప్రక్రియ మనది కాదు. అంటే చిన్న కథ మనం వెస్ట్రన్ వాళ్ళనుండి అరువు తెచ్చుకున్నాం. వాళ్ళ కథకి రెండొందలేళ్ళ పైగా చరిత్రుంది. కథలు రాయాలనుకునే వాళ్ళు విస్త్రుతంగా చదవాలి. కథ అనగానే పాఠకుడి దృష్టి వస్తువు మీదే కేంద్రీకరించబడుంటుంది. అందులో చిక్కుబడిపోకుండా మిగతా అంశాలు కూడా చూడగలగాలి. చాలా విషయాలున్నాయి. ఇలా ఒకటీ అరా వాక్యాల్లో తేల్చేసేవీ కావు.

    తిండిలో ఎవరి రుచులు వారివే! ఒకరికి కారం ఇష్టం; మరొకరికి తీపి; ఇంకొకరికి కమ్మదనం.
    కథల విషయంలోనూ ఇది వర్తిస్తుంది.

    రావిశాస్త్రి కథల్లో చిన్న పాయింటు చుట్టూ ఎంతో ఆసక్తికరంగా ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కరిస్తూ భాషతో చమత్కారాలు అద్దీ కథని చదివించగల గుణం కనిపిస్తుంది. అలాని రావిశాస్త్రి కథలు కథలేనా అంటే ఏం చెప్పగలరు?

    బ్రహ్మానందం

  19. 26 kasturimuralikrishna 7:58 సా. వద్ద ఏప్రిల్ 22, 2011

    అబ్రకదబ్ర గారూ

    మీ కథలు సాక్షిలోనూ, ఆంధ్రజ్యోతి లోనూ వచ్చాయి. నేను చదివాను. మీరు సైన్స్ ఫిక్షన్ కథలు రాయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, మీరు ఎన్ ఆర్ ఐ కాటెగొరీకి చెందుతారు. కాబట్టి, మాకు వర్తించే కొన్ని విషయాలు మీకు వర్తించవు. అందుకే వందల సంఖ్యలో వైవిధ్యభరితమయిన కథలు రాసేవాళ్ళకు పట్టని అద్
    ఋష్టం మీకు కలుగుతోంది. అభినందనలు.

    సంకలన కర్తలు, విమర్శకులూ ఒకే తానుకు చెందినవారు కాకపోవచ్చు కానీ ఇప్పటి సంకలన కర్తలు విమర్శకులంతా 99 శాతం ఒకటే.

    రాజాశ్రయం రచయితలకు ఆవశ్యకం. గతంలో చూస్తేకూడా మనకు దొరుకుతున్న రచనలనేకం రాజాస్థానంలోని కవులవే. కొన్ని exceptions ఎలానూ వుంటాయి. ఇక్కడ నేను చెప్పదలచుకున్నదేమిటంటే, ఒక రచయితకు పేరు రావటానికి, అతని కథలకు గుర్తింపు లభించటానికి, సంకలనాల్లో చేరటానికి ప్రతిభతో సంబంధంలేదు. దీని వెనుక మతలబులు చాలా వున్నాయి.

    ఒక జర్నలిస్టు రచయితకు తన కథలను ఎవరూ పొగడటంలేదు, విశ్లేషించటంలేదు అని బాధ కలిగింది. దాంతో అతను, ఒక సంకలన కర్తను పట్టుకుని, అతని ద్వారా తెలుగు భాషను ఉద్ధరిస్తున్నట్టు ప్రకటించి, అతని పేరు మీద తనవి, తన స్నేహితూవి కథలు సంకలించి ప్రచురించాడు. రచయిత తన కథలు సంకలనం చేసుకుమ్నేకన్నా వేరేవారు చేస్తే గొప్ప కదా! జర్నలిస్టు స్నేహితుడు కాబట్టి పత్రికలన్నీ అద్భుతమయిన రివ్యూలు రాశాయి. సాహిత్య సంస్థలు ఆ సంకలనాన్ని పొగిడేసి అవార్డులిచ్చాయి. ఆ కథలను సంకలనం చేయని సంకలనకర్తకు ఇప్పుడె తెలుగుభాషను ఉద్ధరిస్తున్నందుకు అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడా సంకలనం, అందులోని కథలు ప్రామాణికమయ్యాయి. అంతకన్నా చక్కని కథలు ఏమూల పడ్డాయో ఎవరికీ తెలియదు. తెలుగు సాహిత్యంలో జరుగుతున్నది ఇది. ఇంకా ఇంతకన్నా ఘోరమయిన కథలున్నాయి, కథల సంకలనాల వెనుక. సంకలన కర్త పేరు చూసి పుస్తకం తెరవకుండానే అందులో వుండే రచయితల పేర్లు చెప్పేయవచ్చు.

    గొర్తి బ్రహ్మానందం గారు

    రావి శాస్త్రి గారి కథలు గొప్పవే. కానీ ఆయన కమ్యూనిస్టు సమర్ధక వస్తువుతో కథలు రాయక పోతే ఆయననెవరూ పట్టించుకునేవారు కారు. కాళీపట్నం రామారావుతో సహా పేరున్న కథకులందరికీ ఇది వర్తిస్తుంది. అంటే మిగతావన్నీ ఎలావున్నా మన విమర్శకులు వస్తువు ఆధారంగా కథకు ప్రాధాన్యం ఇస్తారు. దాంతో రచయితలంతా అలాంటివి రాస్తేనే గుర్తింపు అని అర్ధం చేసుకుని అలాంటివే రాస్తున్నారు. కథ మనకు పాశ్చాత్యులనుంచి వచ్చిమదనే చర్చ పక్కన పెడితే, మన కథలకు లక్షణాలు, ప్రామాణికాలు మాత్రం వామపక్ష భావల రాజ్యాల సాహిత్యం నుంచే వచ్చాయి. అందుకనే మూస విమర్శకులు, మూస పద్ధతిలో మూస కథలనే పొగడుతారు. రచయితలూ అలాంటివే రాస్తారు. ఇందులో రచయితల దోశం ఏమీ లేదు. పాఠకుల దోశం అసలేలేదు. మీరు గమనిస్తే విమర్శకులు మెచ్చేదానికీ పాఠకులకు నచ్చేదానికీ నడుమ చాలా తేడా వుంది.మల్లది, యండమూరి వంటి రచయితలు మన విమర్శకుల దృష్టికి ఆనరు. కానీ పాఠకులు వారి రచనలను వదలరు. ఎందుకని?
    శ్రీవల్లీ రాధిక, వసుంధర, వారణాసి నాగలక్ష్మి, భాగ్యశ్రీ, ఎనుగంటి వేణు గోపాల్, గోపిని కరుణాకర్, సం వెం రమేష్, సీఉమాదేవి, బీ.మురళీధర్, సోమశంకర్, తాతారావు, ఘటికాచలపతి, శ్రీఉదయిని వంటి రచయితలకు పాథకుల ఆదరణ ఎంతగానో వుంది. వారి కథల విశ్లేషణ ఎక్కడయినా చదివారా?
    అంతెందుకు, నావే రాజతరంగిణి కథలు, రియల్ స్టోరీస్, సైన్స్ ఫిక్షన్ కథలు, జీవితం జాతకం కథలు పాథకుల ఆదరణ పొందుతున్నాయి. అన్నీ రెండవ ముద్రణ పూర్తయి మూడవ ముద్రణకు వెళ్తున్నాయి. వీటి గురించి ఏ పత్రికలఓనయినా విశ్లేషణలు చర్చలు చదివారా?
    పాఠకుడికి వస్తువు ప్రాధాన్యం కాదు. చదివించగలిగితే మెచ్చుతాడు. కానీ, మంచికథలివిగో అని పాథకుడికి చెప్పే విమర్శకులకు, పెద్దలకు మాత్రం వస్తువే ప్రాధాన్యం. మీరు – పత్రికకు భారతీయ ధర్మాన్ని పొగిడే కథను పంపించి చూడండి. సంసారంలోని మాధుర్యాన్ని చూపుతూ, అక్రమ సంధాలను విమర్శించే కథ పంపండి. -కు తెలంగాణా ఉద్యమాన్ని విమర్శించే కథ పంపండి. -కి వర్ణ వ్యవస్థను సమర్ధించే కథ పంపండి. –కు అగ్రవర్ణాల గొప్పతనం చెప్పే కథ పంపండి. ఇంకా ఇలాంటివి బోలెడన్ని వున్నాయి. మీ శైలితో, రచ్నలోని గొప్ప తనంతో సంబంధం లేకుండా మీ కథలు తిరస్కైస్తారు. కాబట్టి మన తెలుగు సాహిత్యంలో విమర్శకులకు వస్తువే ప్రాధాన్యం.

    • 27 రావు 11:50 సా. వద్ద ఏప్రిల్ 23, 2011

      మీ అవేదనకు అర్థమున్నట్లు అనిపిస్తోంది.
      జర్నలిస్టు మితృడు కథా సంకలనాన్ని అచ్చేసి అవార్డు పొందిన తీరు చెప్పిన మీరు, ఆ జర్నలిస్టు గారి పేరు, సంకలనం పేరు, సంకలన కర్త పేరు, ఇంకా ఆ సంకలనాలలో చోటు పొందిన స్నేహిత రచయితల పేర్లు చెప్పొచ్చుకదా?!
      మీరని కాదు కానీ, చాలా మంది ఇలాగే ‘కథల వెనుక కథలు’ చెప్పి, కర్తల పేర్లు చెప్పక పోవడం వల్ల ఒనగూరే ఉపయోగమేమీ ఉండదు. వారి దారిలో వారు చక్కా సంకలనాలేసుకుంటూ వెళుతుంటారు, మీ దారిలో మీరు generalized comments చేసుకుంటూ వెళుతుంటారు.
      వీటి వల్ల ఉపయోగమేమైనా ఉంటుందనుకుంటున్నారా?

      – రావు

    • 28 అబ్రకదబ్ర 1:36 ఉద. వద్ద ఏప్రిల్ 24, 2011

      >> “మీరు ఎన్ ఆర్ ఐ కాటెగొరీకి చెందుతారు. కాబట్టి, మాకు వర్తించే కొన్ని విషయాలు మీకు వర్తించవు”

      అంటే ఎన్నారైలకి ప్రైవేటు బ్యాంకులోళ్లే కాక పత్రికలోళ్లు కూడా ప్రత్యేక ప్రివిలేజెస్ ఇస్తున్నారన్నమాట. Hmm…. truth be told, I like it. I like it very much 😉

      ఈ గ్రూపులూ, ఒకరి వీపొకరు గోక్కోవటాలూ ఇవన్నీ ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ, మార్పు ముందు రచయితల్లో రావాలనేది నా నిశ్చితాభిప్రాయం. ఎవరో ఏదో అడిగారని అలాగే రాసిచ్చేవాడేం రచయితండీ? కథల్లో అన్నన్ని నీతులు చెప్పేవాడు తన సొంత వ్యక్తిత్వాన్ని చంపుకుని రాయాలన్నది రాయకుండా ఎవర్నో మెప్పించటానికి ఏదేదో రాయటం ….. నాకర్ధం కాదు. సమస్య సంపాదకులు కాదు, విమర్శకులూ కాదు. ఇలాంటి రచయితలే.

  20. 29 జంపాల చౌదరి 11:59 సా. వద్ద ఏప్రిల్ 22, 2011

    చాలా ఏళ్ళుగా, చాలా పత్రికలలో కథలు చదువుతున్నవాణ్ణి. కథ మీద అభిమానంతో తప్పనిసరి కాకపోయినా చాలా తద్దినాలు నెత్తిన వేసుకొన్నవాణ్ణి. మీరు చదివిన సంకలనాలేమో మీరు చెప్పలేదుగానీ, వాటిలో నేను చాలావరకూ చదివి ఉండే అవకాశం ఎక్కువే. తెలుగు కథ పట్ల, కథా సంకలనాల పట్ల, ఎన్నారై కథల పట్ల మీరు, ఇతర వ్యాఖ్యాతలు వెలిబుచ్చిన నిరసనతోనూ, నిరాశతోనూ నేను ఏకీభవించను.

    మీతో ఏకీభవించే విషయం ఒక్కటుంది. చాలా కథలు పాఠకులలో పఠనాసక్తిని దోహదం చేసేవిగా ఉండడం లేదు. మంచి రచన చేయగలవారి చూపు విషాద, భీభత్స ప్రధాన విషయాలపైనే ఉంటుంది. దీనివల్ల పాఠకులను కోల్పోయే ప్రమాదం ఉంది.

    • 30 అబ్రకదబ్ర 1:46 ఉద. వద్ద ఏప్రిల్ 24, 2011

      చౌదరి గారు,

      మీరు నాతో ఏకీభవించకుండానే ఏకీభవిస్తున్నారు.

      ఆ సంకలనాలు మీరు చదివినవే. ఆ ‘తప్పనిసరి తద్దినం నెత్తినేసుకున్న పెద్దాయన’ మరెవరో కాదు, మీరే. ‘ఇంచుమించు ఇలాంటి మొత్తుకోలు’ మీదే.

      సమస్య సంకలనాలతో కాదు. వస్తు వైవిధ్యం లేని కథలతో. ఉన్నవన్నీ ఒకే మూస కథలైతే ఏ సంకలనంలోనైనా అవే కదా అగుపించేది. అదే నా బాధ.

      • 31 జంపాల చౌదరి 1:50 సా. వద్ద ఏప్రిల్ 24, 2011

        అబ్రకదబ్ర గారూ:
        ముందే గుర్తు పట్టాను; నా మాటలకు నేనుద్దేశించని అర్థాలు రాకూడదనే మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం. నాసి రకం కథలు, మూస కథలు ఎక్కువ కాదని నేను అనటం లేదు, నిరాశ పడాల్సిన అవసరం, మరీ అంత తీసిపడవేయవలసిన అవసరమూ లేదని అంటున్నాను. ఎప్పుడైనా ఏ భాషలోనైనా కొంతమంది కథకులే సాధారణ స్థాయి దాటి పైకెగరగలరు. ప్రస్తుతం తెలుగులోనూ అంతే. మీరు హేళనగా తీసిపారేసిన ఎన్నారై కథకుల్లో ఈ శాతం ఇంకొద్దిగా ఎక్కువే. వస్తువు, నిర్మాణం, శైలి విషయాల్లో ప్రయోగాలు చేస్తూ, మంచి కథలు వ్రాస్తున్న తెలుగు ఎన్నారైలు అమెరికాలో లెక్కించదగ్గ సంఖ్యలోనే ఉన్నారు.

        కేతు విశ్వనాథ రెడ్దిగారి కథ అమ్మ నవ్వింది; గాంధీగిరి రచయిత తోలేటి జగన్మోహనరావు; ఈయన కప్పడాలు కథ నాకు బాగా ఇష్టమైన కథల్లో ఒకటి.

  21. 34 Brahmanandam Gorti 12:39 ఉద. వద్ద ఏప్రిల్ 23, 2011

    మురళీ కృష్ణ గారూ,

    మిగతా వారి సంగతి ఎలా వున్నా నా మటుక్కి నాకు కథ చదివించగలగాలి. అది ఏ భావ జాలమ్నుండి వచ్చిందీ, ఎవరు భుజాన మోస్తున్నారూ అన్నది చూడను. చదివితే కథా వస్తువు ఎలాగూ తెలుస్తుంది. కానీ అది చెప్పే తీరూ, వాతావరణమూ, సహజత్వమూ, ఇలాంటివి ఆ కథలో ఎలా రచయిత చొప్పించాడాని చూస్తాను. నేనొక పుస్తకాల పురుగుని. కనిపించినవన్నీ చదువుతాను. కాబట్టి కథ ఇల్లానే ఉండాలీ, ఇదే వస్తువుండాలీ, ఈ పద్ధతిలోనే రాయాలన్నది నాకు ముఖ్యం కాదు.

    ఇదలా ఉంచితే – మీరు ఒక పక్క సంకలనాలు చేసే వాళ్ళని దుయ్యబడుతున్నారు, మరో పక్క పాఠకుల ఆదరణే ముఖ్యం అన్న ధోరణిలో రాస్తున్నారు. కథకి పాఠకుల ఆదరణే ముఖ్యం కాదు. చాలా మంది దృష్టిలో మల్లాది చాలా పెద్ద కథకుడు. నా దృష్టిలో కానే కాదు. ఇంకా నికార్సుగా చెప్ప మంటారా కాలక్షేపం రచయిత. రైళూ, బస్సు ప్రయాణాల్లో కాలాన్ని చంపడానికి పనికొచ్చేవి. ప్రయాణం మొత్తం చదువుతాం. వాహనం దిగగానే పుస్తకాన్నీ, చదివిన దాన్నీ వదిలేస్తాం. మల్లాది నాలుగు వేల కథలు రాసారట. మచ్చుక్కి ఒక్క మంచి కథ చెప్పండి? మల్లాదీ, వీరేంద్రనాధుల్లో రెండో ఆయిన చాలా చాలా బెటరు. కనీసం ఆయన భాషా, శైలీ చదివించేలా చేస్తాయి. మల్లాదివి హోలు మొత్తం
    నాసిరకం. ఇది నా అభిప్రాయం. కానీ మల్లాది రచనలంటే చెవికోసుకునే వాళ్ళుంటారు. ఆయనే పెద్ద రచయితనే వాళ్ళూ ఉంటారు.

    జేంస్ హాడ్లీ చేస్ నవలలకి అమెరికాలో చాలా ఆదరణా, గిరాకీ ఉంది. అలాని చేజ్ రాసిన కథలు మంచి కథలని ఎవ్వరూ అనరు. ఆదరణ వేరూ, ప్రామాణికం వేరూ. పెంగ్విన్ వాళ్ళు ప్రతీ ఏటా మంచి కథల సంకలనం ఒకటి వేస్తారు. అందులో చాలా కథలు ఓ పట్టాన ఎవరికీ ఎక్కవు. కొన్ని ఒకటికి రెండు సార్లు చదివితే కానీ బుర్రకెక్కవు. కానీ ఆ సంకలనాలు అందరూ పడి పడి చదువుతారు. వాటిలో ఇంతవరకూ ఝుంపాలహరి కథ ఒక్కటీ రాలేదు. అలాని ఆవిడ మంచి రచయిత కాకుండా పోదు. పాఠకుల ఆదరణే ముఖ్యం అనుకునేవారు అదే ప్రామాణికంగా తీసుకుంటారు. కాదూ కథకి వస్తువే కాదూ, వేరేవి ఉంటాయనుకునే వాళ్ళ ప్రమాణాలు మరోలా ఉంటాయి.

    కథల మీద విమర్శ పేరు చెప్పి జడ్జిమెంట్లు ఇవ్వడం ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు చేసుకుంటారు. ఇది సంకలనాలు చేసినా వాళ్ళయినా, సమీక్షలు రాసే వాళ్ళయినా చేసే పనే అది. సంకలనాల్లో వస్తే గొప్ప కథా, రాకపోతే పనికిమాలిన కథా అయిపోదు. ఈ చర్చెలాంటిదంటే అవార్డు సినిమాకీ, హిట్ సినిమాకీ ఉన్న తేడాలాంటిది. అవార్డులన్నీ నెత్తిన పెట్టుకున్న అక్కినేని గొప్ప నటుడా, కనీసం పద్మశ్రీ కూడా దక్కని సావిత్రి మంచి నటా అని ప్రశ్నించడంలా ఉంటుంది.

    కథలన్నీ పోజిటివ్ గానే ఉండాలని లేదు. ఎందుకంటే అందరూ అలా ఉండరు. మన చుట్టూ ఉన్న మంచి చెడుల్ని విశ్లేషిస్తే చాలు. కొత్త కోణంలో ఆవిష్కరిస్తే కథ తయారవుతుంది. నా వరకూ కథకి వస్తువొక్కటే ముఖ్యం కాదు. నాతో విభేదిస్తే నేనేమీ అనుకోను. నావరకూ కథ రాయాడానికి ఆ వస్తువూ, ఇతివృత్తం విభిన్నంగా వుండి నన్ను కదిలించాలి. అప్పుడే రాస్తాను. అవి మానవ సంబంధాలయినా, డ్రామా అయినా, సైన్సు ఫిక్షనయినా!

    చివరగా – “పాఠకుడికి వస్తువు ప్రాధాన్యం కాదు. చదివించగలిగితే మెచ్చుతాడు. కానీ, మంచికథలివిగో అని పాథకుడికి చెప్పే విమర్శకులకు, పెద్దలకు మాత్రం వస్తువే ప్రాధాన్యం.” అని మీరన్నారు. మీరూ కౌముదిలో ప్రతీ నెలా కథా విమర్శ పేరుతో శీర్షిక నిర్వహించారు. మీ విమర్శ కూడా నిష్పక్షపాతంగా ఉందంటారా? మీరూ ప్రామాణికం అంటూ నిర్ధారించారు కదా? మీరూ చెప్పినవన్నీ వాటికీ ఆపాదించి చూడండి.

    ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే తెలుగు కథ పత్రికలవాళ్ళ చేతిలో నలిగిపోతోంది. వాళ్ళ వాళ్ళ స్నేహాలూ, రాజకీయాలూ, అభిరుచులూ, లాభనష్టాల మధ్య ఊపిరి సలపకుండా చస్తోంది. ఈ పత్రికలే యధాశక్తి తెలుగు నవలని చంపేసాయి. నాటకాలని నల్లిని నలిపినట్టు నలిపేసాయి. పద్య కవిత్వాన్ని తరిమి కొట్టాయి. ఇహ మిగిలింది కథ. దాన్నికూడా ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకునే వరకూ నిద్ర పోరు. ఇదెంత కాలం లెండి. ఇంకో పదేళ్ళకి ఈ అచ్చుపత్రికలన్నీ మూటా ముల్లీ సర్దుకుంటాయి. అది మాత్రం ఖాయం.

    మనం ఇలా చర్చించుకొని ఉపయోగం లేదు;కంఠ శోష, చేతి నొప్పీ తప్ప. రచయితలకి నచ్చింది రాయడం. బావుందా మెచ్చుకుంటారు. లేదంటారా?

  22. 35 kasturimuralikrishna 6:23 ఉద. వద్ద ఏప్రిల్ 24, 2011

    చర్చ ముగింపుకువస్తోంది కాబట్టి ముగింపు వాక్యాలు రాస్తాను.
    అబ్రకదబ్ర గారూ

    మీరు రచయితలనే తప్పుపడుతున్నారు. రచయితలూ మామూలు మనుషులే. తమకు నచ్చినట్టే రాస్తామని పట్టుపట్టేవారు అరుదు. మిగతా అంతా మనసును చంపుకుని రాస్తూ వచ్చిన పేరుతో సంతృప్తి పడేవారే. అంతెందుకు, వేటూరినే తీసుకోండి. ఆయన ఎలాంటి పాటలు రాయగలడు? ఎలాంటి పాటలు రాశాడు? రచయితలందరిదీ ఒకే పరిస్థితి. అందరికీ కృష్ణ శాస్త్ర్య్, సాహిర్ లూధియానవీల అదృష్టం వుండదు. మీరు చెప్పేది ఆదర్శం. నేను చెప్తున్నది అనుభవమ్మ్. కాబట్టి సమస్య ఎక్కడుందో మీరే ఆలోచించండి.

    గొర్తి బ్రహ్మానందం గారూ

    చర్చించుకుని ఉపయోగం లేదని తీర్మానించిన తరువాత చర్చనేలేదు. కానీ ఒక విషయం మల్లాది, యండమూరి లు లేకపోతే ఆధునిక తెలుగు పాపులర్ సాహిత్యమే లేదు. ఆంగ్లం లో ఒక జెఫ్రీ ఆర్చర్ కు, సిడ్నీషెల్డన్ కూ లభించే గౌరవం మన తెలుగులో పాపులర్ రచయితలకు లభించదు. అదీ మన సాహిత్య ప్రపంచంలో లోపం. యండమూరి, మల్లాది ల స్థాయికి చేరుకోలేని వారెందరో వారి మీద విమర్శలు గుప్పిస్తారు. దాన్లో అసూయ ఎక్కువ. అవగాహన తక్కువ.( మీకు ఈ వ్యాఖ్య వర్తించదనుకోండి). ఇక జేంస్ హాడ్లీ చేస్ ప్రసక్తి వస్తే, ఆయనకు ఆంగ్ల సాహిత్యంలో విశిష్ట స్థానాన్నిచ్చారు. అమెరికలో అడుగుపెట్టకుండా, కేవలం అట్లాస్ మాత్రమే చూస్తూ, జీవితాంతం అమెరికాలో బ్రతికినవాడిలా అధ్భుతమయిన సృజన చేసిన ప్రతిభ అతనిది. ఆసక్తికరమయిన రచనలు చేయటంలో అతని రచనలు పాఠ్యపుస్తకాలు. మరో విషయం, ఆంగ్లం మాతృబ్భాష కాని వారు ఇంగ్లీషు చదవటం సులభంగా నేర్చుకోవటానికి ఒకటో తరగతి పుస్తకాలు అతని రచనలు.

    ఇక నా కథాసాగరమథనం గురించి, అందులో నిజాలను నిర్భయంగా చెప్తున్నాను కాబట్టే ఎందరొ మిత్రులు శత్రువులయ్యారు.అ. నాకు స్నేహాన్ని పెంచుకోవటం ఎలాగో రాదు. శత్రువలను పెంచుకోవటం ఎందుకని ఆ శీర్షిక ఆపేశానందుకే. ఇక రచయితలకు కావాల్సింది పాఠకుల ఆదరణతో పాటూ, విమర్శకుల గుర్తింపు కూడా. పాఠకుల ఆదరణ వల్ల సంతృప్తి లభిస్తుంది. విమర్శకుల గుర్తింపు వల్ల శాశ్వతత్వం లభిస్తుంది. మీకు అర్ధమయిందనే అనుకుంటున్నాను.

    జంపాల చౌధరి గారు

    ఏమీ తెలియని వారికి అన్నీ చెప్పవచ్చు. అన్నీ తెలిసిన వారికి ఏమీ చెప్పనవసరం లేదు. తెలిసీ తెలియనట్టున్నవారికి చెప్పటం కష్టం. చెప్పీ లాభం లేదు. క్సమించండి. రెండు దశాబ్దాల కథల పుస్తకానికి ముందుమాటనే మీకన్నీ తెలుసనటానికి నిదర్శనం.

    రావుగారూ

    కొన్ని విషయాలు జరుగుతున్నాయని తెలిసినా బహిరంగంగా ఎవ్వరూ అనరు. అలా అన్నవారు సాహిత్యరంగంలో బహిష్కృతులవుతారు. ఇప్పటికే నా పరిస్థితి అంటరానివాడికెక్కువ, అస్పృశ్యునికి తక్కువగా వుంది. అదీగాక, కొన్నిటికి నిరూపణలుండవు. అలాంటప్పుడు పేర్లుచెప్పటం ఆధారాలు లేని ఆరోపణలవుతాయి. అయినా మరో విషయం చెప్తాను. ఒక జర్నలిస్తు మారు పేరుతో తనకు లాభం వుంటుందనిపించిన రచయితల కథలను మెచ్చుకుంటూ రాస్తాడు. ఇందువల్ల అతనికి పబ్బం గడచిపోతోంది. రచయితలకూ లాభం. ఆ పరిథిలోకి రానివారిని పట్టించుకోడా పేరుపొందిన మారుపేరు సాహిత్య విమర్శకుడు. ఈ విషయాన్ని నేను బహిరంగంగా ప్రస్తావించానని ఇప్పుడు నా పుస్తక సమీక్షలు కొన్ని పత్రికలలో రావు. అదేమిటని అడిగితే, మీరిచ్చిన కాపీలు పోయాయి ఇంకో రెండు కాపీలివ్వండి అంటారు. ఇంకో రెండిస్తే, మరో రెండేళ్ళ తరువాత ఇంకో రెండడుగుతారు. అందుకే సాహిత్య మాఫియా ముఠాలన్న పదాన్ని వాడతాను నేను.
    ఇంతటితో చర్చ ముగుసిందనుకుంటున్నాను. సెలవు. ఎవరికయినా బధకలిగితే…. నిజాలెప్పుడూ బాధాకరంగానే వుంటాయి. విన్నవారికీ, చెప్పేవారికీ కూడా…..

  23. 36 కొత్తపాళీ 7:12 ఉద. వద్ద ఏప్రిల్ 24, 2011

    మంచి చర్చ. దానికి విత్తునాటినందుకు నెనర్లు అబ్రకదబ్ర గారు.
    మీరు ఉద్యమస్ఫూర్తితో ఏకబిగిని అన్ని సంకలనాలు/కథలు చదవడం చాలా ముచ్చటగొలిపింది. కొన్నయినా (ఒక పాతిక?) మీకు నచ్చాయన్నారు. అన్ని కథ లిస్టూ కాకపోయినా నచ్చిన వాటి లిస్టయినా చెబితే బాగుంటుంది.

  24. 37 KL Sampath Kumar 8:12 సా. వద్ద ఏప్రిల్ 24, 2011

    I read the “UTTUTTAM KATHALU”
    I can not disagree totally with his comments.
    But one should not lose hope.
    One should always read the stories being published in the print media and web media.If the time is the constraint I can understand, but one can not stop totally reading the stories.
    Recently I read the katha sankalanam “SHYAMIYANA”.
    And I am impressed with the stories written about two to three decades back.

  25. 38 సుజాత 9:02 సా. వద్ద ఏప్రిల్ 24, 2011

    తమకు నచ్చినట్టే రాస్తామని పట్టుపట్టేవారు అరుదు. మిగతా అంతా మనసును చంపుకుని రాస్తూ వచ్చిన పేరుతో సంతృప్తి పడేవారే………………..

    మురళీ కృష్ణ గారూ,ఎవరు రాయమన్నారు? అసలు ఇలా ఎవరు రాస్తారు? కేవలం రాయడమే వృత్తిగా, దాన్నే జీవనోపాథిగా మలచుకున్న వారు. మంచి కథలు రాసి మంచి రచయితలు గా పాఠకుల మనసుల్లో నిల్చిపోవాలనుకున్న వారు అలా మనసు చంపుకుని రాయవలసిన అవసరం ఏముందీ? మంచి కథలను ఒక పత్రిక కాకపోతే మరొక పత్రిక ప్రచురిస్తుంది.

    పేరు, డబ్బు కావాలనుకునే రచయితలనీ అలాగే మనసు చంపుకుని ఎడిటర్లకు, విమర్శకులకు నచ్చిన కథలు రాయనివ్వండి.

    కథలు నచ్చాల్సింది పాఠకులకే అనుకున్న రచయితలు వైవిధ్యంతో కూడిన కథలు రాస్తారు.

    మీ వ్యాఖ్యలన్నీ పరిశీలిస్తే మొత్తానికి కథలు, రచయితలు, విమర్శకులు, ఎడిటర్లు, సంకలనాలు——వీరి మధ్య పెద్ద కథే నడుస్తోందని,ఇదొక కక్షలు, కార్పణ్యాలు, పట్టింపులతో కూడిన వ్యవహారమని సామాన్య పాఠకులకు అర్థమవుతోంది. అందుకు మీకు థాంక్స్ చెప్పాలి.

  26. 39 Brahmanandam Gorti 10:55 సా. వద్ద ఏప్రిల్ 24, 2011

    మురళీ కృష్ణ గారూ,

    అందరం ఇక్కడ చర్చించుకుని ఎవర్ని మార్చగలం? దేన్ని సరిదిద్దగలం? అన్న ఉద్దేశ్యంతోనే కంఠశోష అని రాసాను తప్ప చర్చనుండి విరమించాలనీ కాదు. మీరు చూపించిన ఆవేశమే నాకూ ఉండేది. నాసిరకం కథల్ని పట్టుకొనీ ఆహా ఓహో అంటూ రాస్తారేమిటని గింజుకునేవాణ్ణి. వాక్యం సరిగా రాయలేని వాళ్ళని మేధావులూ, మహా రచయితలూ అనడం చూసి బాధ పడేవాణ్ణి. వీటి వల్ల నాకు కాస్త మనస్తాపం తప్ప ప్రయోజనం లేదని గ్రహించి ఇలాంటివి పట్టించుకోడం మానేసాను. ఇదే పూర్తిగా చెప్పకుండా చర్చ అనవసరం అనేసాను తప్ప పలాయనం కాదు.

    మంచి సాహిత్యం రావాలంటే పత్రికల దృష్టి మారాలి. మంచి అభిరుచున్న సంపాదకులు రావాలి. వ్యక్తుల్ని బట్టి కాక వస్తువుని బట్టి కండున్నవి ప్రచురించే సంపాదకులు కావాలి. ప్రస్తుతం చాలా పత్రికల్లో, ముఖ్యంగా వారపత్రికల్లో సంపాదకులకి లభించిన పదవి పైరవీలూ, భజన ప్రసాదాలూ తప్ప వారి స్వశక్తిమీద వచ్చినవి కావు. నాసిరకం విత్తనం నాటి అమృత ఫలాలు ఆశించడం అవివేకం. మార్పు రచయితల్లో కంటే ముందుగా సంపాదకుల్లోనే రావాలి. ఎందుకంటే పత్రికలే రచయితలకి వాహకాలు. అవిలేకుండా ఏ రచయితా పాఠకుణ్ణి చేరలేడు. మందక్కడ వేస్తే, అప్పుడు సాహిత్యమూ ఆరోగ్యంగా ఉంటుంది.

    యండమూరిని చూసి అసూయపడేవాళ్ళున్నారూ అంటే కాస్తయినా సంతోషించే విషయం. మల్లాదిని చూసి అసూయపడేవాళ్ళని చూసి జాలిపడాలి. అంతే!

    మీరు నిష్పక్షపాతంగా కధావిమర్శ చేసారని మీరన్నారు. నేను మీరు రాసేవన్నీ చదివాను. కానీ నాకా అభిప్రాయం కలగలేదు. ఒక్కోసారయితే మరీ నాసిరకం కథల్ని మీరు ఆకాశానికెత్తేసారనిపించింది. మీ మొత్తం కథా విశ్లేషణంతా వస్తువు చుట్టే పరిభ్రమించింది. దాన్ని దాటి ఒక్కంగుళం కూడా కదల్లేదు. కొన్ని సందర్భాల్లో అయితే మీరు మంచి కథన్న వకాల్తా ఇచ్చిన కథలో వాక్యనిర్మాణం సరిగా లేదు. పాత్రోచితం దెబ్బతిన్నాయి. ఇంకొంచం గట్టిగా చెప్పాలంటే చివర నీతి ముగింపులే కనిపించాయి. అందుకే “మీరడిగిన ప్రశ్నలని మీ శీరిషికకి ఆపాదించారా?” అనడిగాను.

    రచయితగా మీరంటే గౌరవం వుంది. కొన్ని మంచివి రాసారు. కానీ మీ ఆక్రోశమే నచ్చలేదు. మీరు కొంతమంది రచయితల్నే విమర్శకులు మోస్తారు అని వాపోయారు. అసలు అమెరికా రచయితలు తెలుగునాట పత్రికలకి కనిపిస్తాయా అని నేను బాధపడిన రోజులూ ఉన్నాయి. ఒకాయనయితే అమెరికాలో ఉన్న రచయితలందరి రచనలు సావనీరుని దాటెళ్ళవన్న హేళననీ చూసాను. ఇవన్నీ చూసి బాధపడేవాణ్ణి. ప్రస్తుతం ఇవేం పట్టించుకోను. నాకు మనసులో ఇంకితే రాస్తాను. ఏ పత్రికయినా వేసుకుందా సంతోషం. లేదా వారికో నమస్కారం. కథ నచ్చిందా? లేదా? అన్నవి కూడా పట్టించుకోడం మానేసాను. గతంలో తెలుసున్న వాళ్ళని అడిగేవాణ్ణి. ఇప్పుడదీ లేదు. కాకపోతే హృదయంలోంచి వచ్చిన మెచ్చుకోలుకీ, పెదాల మీంచి జారిన వాటికీ తేడా మాత్రం బ్రహ్మాండంగా పసిగట్టగలను.

    ఇదంతా ఇప్పుడెందుకు రాస్తున్నానంటే మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి.
    ఇది నా అభిప్రాయం. మీరు నాతో ఏకీభవించాల్సిన అవసరం లేదు.

    సాధారణంగా నేను బ్లాగుల్లో కామెంట్లు పెట్టను. ఒకసారి ఒక బ్లాగులో “తెలుగు సాహిత్యమంతా బ్లాగులో వెల్లివిరుస్తోందన్న వ్యాఖ్యని ఖండించాననీ ఇంకో పెద్దాయన బెత్తం పుచ్చుకొని సవాళ్ళు విసిరాడు. నానా కంగాళీ చేసాడు. ఎందుకొచ్చిన తలనొప్పని వ్యాఖ్యలు పెట్టను. విమర్శా విమర్శా అని గొంతుచించుకునేవారే ఎప్పుడైనా పొరపాటున చిన్నగా తప్పుపడితే తట్టుకోలేరు. ఇది పెద్ద రచయితలకీ వర్తిస్తుంది.

    నిజానికి నాకు చర్చ ఇష్టమే! కానీ చాలా చర్చలు వస్తువునొదిలి వ్యక్తిగతంగా మారుతాయి. ఆ నిక్కచ్చితనం కనిపించకే వాటికి దూరంగా ఉంటాను.

    ఇంత పెద్ద పెద్ద వ్యాఖ్యలు బ్లాగుల్లో రాయడం ఇదే మొదటిసారి. బహుశా చివరిసారి కూడానేమో!

    మిమ్మల్ని నొప్పిస్తే నన్నొదిలేయండి.

    -బ్రహ్మానందం

    • 40 కొత్తపాళీ 9:16 ఉద. వద్ద ఏప్రిల్ 25, 2011

      బ్రహ్మానందంగారు, రెండేళ్ళ కిందట తెలుగుబ్లాగుల్లో సాహిత్యకృషిగురించి చర్చ జరిగితే, దాన్ని కొనసాగించేందుకు మిమ్మల్ని సగౌరవంగా నా బ్లాగుకి ఆహ్వానించాను. మీరు రాలేదు. Just want to set the record straight.

      • 41 Brahmanandam Gorti 11:18 ఉద. వద్ద ఏప్రిల్ 25, 2011

        మీరు సాదరంగా, సగౌర్వంగా చర్చకి పిలిచారని రెండేళ్ళ తరువాత అంటున్నారు కానీ, మీ పిలుపు ధ్వని చర్చకి పిలిచినట్టుగా లేదు. రచ్చకు పిలిచినట్లుగా ఉంది. ఒక్కసారి పాతవి మళ్ళీ తిరిగి చూసుకోండి. ఇంకో విషయం నేను ఒక బ్లాగులో కామెంట్లు పెడితే నా కామెంటుపై ఆ సదరు బ్లాగరు నా ఇల్లూ నా ఇష్టం అన్న చందంగా కొన్ని వ్యాఖ్యలుంచి మరికొన్ని తొలగించడం వల్ల జరిగిన రచ్చ. ఎవరు ఎక్కడ దేని గురించి చర్చించారు? చర్చని మీరనుకుంటున్నారు. నాకు చర్చకీ, రచ్చకీ తేడా తెలుసు. ఒక్క సారి పాత రికార్డులని మరోసారి వెతుక్కోండి, before setting the records straight.

  27. 43 kasturimuralikrishna 10:00 ఉద. వద్ద ఏప్రిల్ 25, 2011

    గొర్తి బ్రహ్మానందం గారూ

    మొత్తానికి కొన్ని మంచి రచనలు చేశానన్నారు. చాలా సంతోశం.

    మల్లాది గారంటే మీకున్న చులకన అభిప్రాయాన్ని మార్చాలని నేను ప్రయత్నించను కానీ, మల్లాదిలా రాయటం ఎంతో కష్టం. మీరుకనక శైలికే ప్రాధాన్యం ఇచ్చేవారయితే మల్లాదికికూడా పెద్దపీట వేస్తారు. ఓపిక చేసుకుని మరోసారి చదివి చూడండి. యద్దనపూడి, మల్లాది, యండమూరి లు లేకపోతే ఈనాడు ఇంతకూడా పాఠకులు వుండేవారు కారు. విప్లవాల జోరు, సిద్ధాంతాల పోరు, ఉత్తుత్తమ కథల రాజకీయాల హోరులను భరించలేక పూర్తిగా తెలుగు సాహిత్యానికి దూరమయిపోయేవారు.

    నేను ఆక్రోశంతోనో, ఆవేశంతోనో రాయటంలేదు. వున్నదివున్నట్టు రాస్తున్నాను. ఆవేశాలు, ఆక్రోశాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. రచనలనుంచి నా దృష్టిని మళ్ళిస్తాయి. జరుగుతున్న దాన్ని చూసి నవ్వుకుంటూంటాను. రచనలనుంచి నాదృష్టిని మళ్ళించే ఏ విషయానికీ ప్రాధాన్యం ఇవ్వను కాబట్టే ఇన్ని ప్రక్రియల్లో ఇన్నిరకాలుగా రచనలు ఉత్తమ స్థాయిలో చేయగలుగుతున్నాను. ఎవరినయినా ఎదిరించి నిలవగలుగుతున్నాను.

    కథాసాగరమథనం గురించి…….. మీ అభిప్రాయాన్ని నేను మన్నిస్తాను. దానిగురించి వివరించటానికి ఇది సందర్భమూ కాదు. సమయమూ కాదు. ఇక వస్తువు విషయానికి వస్తే, ఒక రచన పట్ల మనము అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటానికి వస్తువే ప్రధాన పాత్ర వహిస్తుంది. మిగతావెంత గొప్పగా వున్నా మన దగ్గర వస్తువుకే ప్రాధాన్యం. ఎంత గూప శైలి వున్నా, ఇతర ఎన్ని అంశాలు గొప్పగా వున్నా, మనవారు హారర్ కథలను, డిటెక్టివ్ కథలను, ఇతర ప్రక్రియలలో కథలను సాహిత్యంగా పరిగణించరని ఉత్తుత్తమ కథల సంకలనాలే నిరూపిస్తున్నాయి. అంతెందుకు, జేంస్ హాడ్లీ చేస్ పయిన మీ అభిప్రాయాన్ని అతనెంచుకున్న కథావస్తువు ఎంతగా ప్రభావితం చేసిందో ఆలోచించండి.

    కొమతమదినే విమర్శకులు మోస్తారని నేను వాపోవటంలేదు. ఉన్న పరిస్థితి చెప్తున్నాను. అందువల్ల సాహిత్యానికి జరుగుతున్న నష్టాన్ని వివరించాలని ప్రయత్నిస్తున్నాను. ఇది తెలిసి కొందరయినా ఈ ముఠాల మాయా జాలం నుంచి సాహిత్యాన్ని రక్షించటానికి నడుము కడతారేమో నన్నది నా ఆశ. అది మీకు ఆక్రోశంలా అనిపిస్తే అది మీ దృష్టి. ఇక అమెరికా రచయితలను గుర్తించత్లేదని మీరు రాయటం రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది. కానీ ఎన్ ఆర్ ఐ లు సంస్థలు పెట్టుకుని, పత్రికలను పెట్టించి బాగానే గుర్తింపులు తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు పరిస్థితి మారింది. కథారచయితలు( ఉత్తుత్తమ సంకలనాల అర్హతలేనివారు) కూడా ఎన్ ఆర్ ఐ ల లాగా ఫౌండేషన్లూ, పత్రికలోఅ, అవార్డులలాంటివి ఏవయినా ఆలోచిస్తారేమో భవిష్యత్తులో….
    నేనూ సాధారణంగా కామెంట్లు పెట్టను. అందుకు ఎందరో చిన్నపిల్లల్లాగా అలిగారు కూడా. చర్చలల్లోనూ దిగను. కానీ, ఎంతసేపూ చర్చలు పైపైనే సాగుతూండటంతో కాస్త నిజాల రుచి చూపించాలనిపించింది. అంతే… కనీసం ఈ చర్చ అయినా వ్యక్తిగత దూషణలకు, దిగజారుడు స్థాయికి దూరంగా వుంచామనే అనుకుంటున్నాను. రచయితలు విమర్శలు భరించలేరన్నది నిజం. కానీ నా విషయంలో నాకు విమర్శలే అలవాటు. ఇంతవరకూ ఇలా బహిరంగంగా నావి కనీసం కొన్నయినా బాగుంటాయన్నది మీరే.

    సుజాత గారూ, ఎవరు రాయమన్నారు? అసలు ఇలా ఎవరు రాస్తారు? అనడిగితే ఒక్క ముక్కలో చెప్పటం కష్టం. రచన అనేది ఒక తీరని దాహం. అది ఒక తపస్సు. కౌపీన సమ్రక్షణార్ధం అన్నట్టు ఒకదానినుంచి ఒకదానిలోకి వెళ్ళాల్సి వస్తుంది. తెలియకుండానే మనసు చంపుకోవటం అలవాటయిపోతుంది. అయితే నేను మాత్రం నాకు నచ్చని రచనలు చేయలేదింతవరకూ. ఇప్పుడిక అలాంటి అవసరం రాదనేఅనుకుంటున్నాను. రియల్ స్టోరీలను ప్రేరణనిచ్చే వాస్తవ గాధలుగా మలచి పాఠకులు ఇలాంటి వాటిని క్రైం కన్నా ఎక్కువగా ఆదరిస్తారని నిరూపించిన తరువాత మళ్ళీ క్రైం కథలు రాయమంటే ఆ శీర్షిక వదలుకున్నాను తప్ప వారు కోరినట్టు రాయలేదు.

    మంచి కథలను ఒక పత్రిక కాకపోతే మరొక పత్రిక ప్రచురిస్తుందంటారు. నిజమే. కానీ దానివెనుకకూడా బోలెడన్ని కథలుంటాయి. రచయిత ఎంత గొప్పవాడయినా ఎడిటర్ ముందు అభ్యర్ధే. కోతి కొమ్మొచ్చి హఠాత్తుగా ముగియటం ఇందుకు చక్కని ఉదాహరణ. పేరు డబ్బు కావాలనుకునే రచయితలు అలాగే రాస్తున్నారు. ఒక రచయిత సంపాదకులతో బేరం పెడతాడు. నాకు అవార్డులివ్వండి, డబ్బులు మీరుంచుకోండి అని. అతను జర్నలిస్టు కాడు. అతనికి బోలెడన్ని అవార్డులు వస్తాయి. ఉత్తమ రచయితగా మన్ననలండుకుంటున్నాడు కూడా. ఇదెందుకు చెప్తున్ననంటే, ఈ ప్రచార వ్యాపార యుగంలో ఇలాంటివనేకం మంచి కథను మరుగున పరుస్తున్నప్పుడు, పాథకులు సైతం తాము ఒక మంచి కథను చదివితే దాన్ని పదిమందికీ చెప్పాలి. చదివించాలి. దానికి ప్రచారం ఇవ్వాలి. అప్పుడే ఇలాంటి ఉత్తుతమకథల సంకలనాల అసలు నిగ్గు తేలుతుంది. సాహిత్యం రంగంలో కనీసం మన తరువాత తరంవారయినా మంచి మార్పులు చూస్తారు.

  28. 44 kasturimuralikrishna 10:09 ఉద. వద్ద ఏప్రిల్ 25, 2011

    ఇప్పుడే అందిన వార్త

    ఈ చర్చ చూసిన ఒక ప్రచురణ కర్త నన్నో ఉత్తమ కథల సంకలనం తయారు చేయమన్నాడు. పూర్తిగా చర్చలు జరిగిన తరువాత వివరాలు చెప్తాను. అయితే, నేను రెండు నియమాలు పెట్టాను. ఒకతి కథల ఎంపికలో నాకు పూర్తి స్వేచ్చ నివ్వాలి. అది ఎందుకు ఎంచుకున్నానో కూడా నేను వివరిస్తాను. రెండవ నియమం ఏమిటంటే ఈ సంకలనంలో నా కథ వుండద్దు.

  29. 45 anonymus 10:40 ఉద. వద్ద ఏప్రిల్ 25, 2011

    మీరు రాజతరంగిణి కథలు చదివారా? తెలుగులో హిస్టారికల్ ఫిక్షన్ కథలవి.
    జీవితం-జాతకం కథలు చదివారా? జ్యోతిష శాస్త్రాం ఆధారంగా వ్యక్తిత్వ వికాసం, పాసిటివ్ థింకింగ్ చూపే కథలవి. ష్ర్లాక్ హోంస్ లా ఒక పాత్ర కథలను డాక్టర్ వాట్సన్ లా చెప్పే కథలవి.
    రియల్ స్టోరీస్ చదివారా? నిజ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అర్ధవంతమయిన జీవితాన్ని గడిపిన ఆదర్శవంతులన వ్యక్తుల కథలవి.
    సైన్స్ ఫిక్షన్ కథలు చదివారా? తెలుగులో అరుదుగా వచ్చిన authentic science fiction stories అవి.
    మీరు అతిరాత్ర, మర్మయోగం, పునసృష్టికి పురిటి నొప్పులు వంటి నవలలు చదివారా?
    మీరు నవ్యలో వచ్చిన హారర్ కథలు చదివారా?
    పైన నేను ఉదాహరించిన వన్నీ నేను రాసినవే.

    నావే రాజతరంగిణి కథలు, రియల్ స్టోరీస్, సైన్స్ ఫిక్షన్ కథలు, జీవితం జాతకం కథలు పాథకుల ఆదరణ పొందుతున్నాయి. అన్నీ రెండవ ముద్రణ పూర్తయి మూడవ ముద్రణకు వెళ్తున్నాయి.

    ఇక నా కథాసాగరమథనం గురించి, అందులో నిజాలను నిర్భయంగా చెప్తున్నాను

    హ హ హ… మురళీకృష్ణగారూ ‘స్వకుచ మర్దనం’ ఎందుకు?

  30. 46 శ్రీనివాస్ 11:58 ఉద. వద్ద ఏప్రిల్ 25, 2011

    కథల్లో వైవిధ్యం ఉండటం లేదన్న మీ బాధ అర్థం చేసుకోదగ్గదే గానీ, ఈ కథలనన్నిటినీ దుయ్యబట్టడం సహేతుకం కాదు. వాళ్ళు వాళ్ళ జీవితాల గురించీ, వాళ్లు రోజూ ఎదుర్కొంటున్నవాటి గురించీ రాస్తున్నారు. వాళ్ళకు తెలిసినవి రాయడంలో తప్పేమిటో తెలియడం లేదు. అవి ఎందుకు విసుగు పుట్టిస్తున్నాయో తప్పక ఆలోచించవలసిందే! వాటికి మందు డిటెక్టివ్, హారర్ కథలే అయితే అవి మాత్రం ఎన్నని చదువుతాం? ఆడవాళ్ళ గోళ్ళన్నీ మీకు ఒకేరకంగా కనిపించినట్టు అవన్నీ ఒక నేరమూ, నేరస్తుణ్ణి పట్టుకోడమూ, భయపెట్టడం చుట్టూ తిరగవలసినవేకద! జానపదాలయినా అవే రాకుమార్తెలూ, మాయలూ, మంత్రాలూ, మహిమగల వస్తువులనే కద పదే పదే చదవవల్సి వచ్చేది!

    • 47 అబ్రకదబ్ర 12:14 సా. వద్ద ఏప్రిల్ 25, 2011

      దుయ్యబట్టేది రాసేవాళ్లని కాదు. రాసేదాంట్లో నిబద్ధత లేకపోవటాన్ని. ‘నచ్చకపోతే చదవటం మానెయ్యండి. నచ్చినోళ్లే చదువుతారు’ అని కూడా అనొచ్చు. అదీ నిజమే. కాకపోతే, ఇష్టమొచ్చినది రాసే హక్కు రచయితలకెలా ఉందో, నచ్చనిది నచ్చలేదనే హక్కు పాఠకులకీ ఉంది కదా.

      జీవితానుభవాల్ని కథలుగా మలచటం తప్పని నేననటం లేదు. ‘అన్నీ అవేనా’ అన్నది ప్రశ్న. అన్నీ జానపదాలో, డిటెక్టివ్, సస్పెన్స్ లేదా హారర్ కథలో కావాలనీ అనటం లేదు. అవి కూడా రావాలని మాత్రమే కోరుకుంటున్నాను. కొంపదీసి ఈ టపా చదివి తెలుగు రచయితలు/త్రులు అందరూ మూకుమ్మడిగా డిటెక్టివ్ కథలే రాయటం మొదలు పెడితే అప్పుడు నేను మళ్లీ ఇలాంటి టపా ఇంకోటి రాస్తా 🙂

  31. 48 Rao Lakkaraaju 7:04 సా. వద్ద ఏప్రిల్ 25, 2011

    అబ్రకదబ్ర గారూ మీరేమన్నా తెలుగు కథ ఎల్లా వుండాలి అనే క్లాస్స్ ఎక్కడన్నా చెబుతున్నారా. మేము కధలు వ్రాసి మీ ఎప్రువల్ కి పంపించాలా?. మీకు చాలా అనుభవం వున్నట్లుంది కొచెం చెప్పండి. అందరూ మిమ్మల్ని సలహాలూ అవ్వీ అడుగుతున్నారు. మీకు చాలా ఇన్ ఫ్లు యన్సు ఉన్నట్లుంది.

  32. 49 Giridhar Duggirala 12:59 సా. వద్ద ఏప్రిల్ 28, 2011

    I seriously think why should a writer worry about his story being published or not? Write and send that to publishers if it gets published good if not then send it to another one. There must be one editor who may like his story, Don’t you think so? OR Do you say that “No it can only be published iff we know the publishers/editors personally.”

    Regarding Malladi, its okay he has his own style of writing and many people like that (And BTW you don’t have to poor them).

    This whole conversation/comment/blog posts just reminds me of J.K.Murhty’s quote.

    “Man has built in himself images as a fence of security – religious, political, personal. These manifest as symbols, ideas, beliefs. The burden of these images dominates man’s thinking, his relationships and his daily life. These images are the causes of our problems for they divide man from man.”

    And I would like to add Perspective to Perspective.

    You have your own definition/opinion how a story should be, other may not have the same opinion right?

    JK gaari quote ikkada vaadatam ekkuvaindi ante I am sorry. 🙂

  33. 50 అబ్రకదబ్ర 3:20 సా. వద్ద ఏప్రిల్ 28, 2011

    >> “You have your own definition/opinion how a story should be, other may not have the same opinion right?”

    Damn right. And we also have the darn right to announce our opinions aloud – which is the source of all this noise 😀

  34. 52 Wanderer 1:06 సా. వద్ద సెప్టెంబర్ 12, 2012

    @అబ్రకదబ్ర – సంబంధం లేనట్టున్నా, కాస్తో కూస్తో సంబంధం ఉన్న కామెంటు.. Harry Potter series చదివారనీ, అది మీకు నచ్చిందనీ ఆశిస్తున్నా.


వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,024

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.