రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర భవిష్యత్తును విశేషంగా ప్రభావితం చేయగలిగే సంఘటనలు రెండు జరిగాయి. కొన్నాళ్లుగా ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న చిరంజీవి పార్టీ ప్రారంభం ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా జరగనుందనే స్పష్టమైన సంకేతం వాటిలో మొదటిది కాగా, ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి చావు తప్పి కన్ను లొట్టపోవటం రెండవది. మొదటి విషయం చిరంజీవి అభిమానులకూ, రెండవది రాష్ట్ర సమైక్యవాదులకూ అమితానందం కలిగించేవి.
మూడు దశాబ్దాలకాలంలో నూట నలభై తొమ్మిది చిత్రాల్లో నటించి కూడబెట్టుకున్న ప్రజాభిమానమే పెట్టుబడిగా రాజకీయ యవనికపై తొలి అడుగులు వేయటానికి సంసిద్ధమైన చిరంజీవి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు గుబులు పుట్టిస్తున్నారు. అయితే, 1983లో ఎన్టీయార్ లాగా ఇప్పుడు చిరంజీవి కూడా ఆ స్థాయి ప్రభంజనం సృష్టించగలుగుతారనేది ప్రశ్నార్ధకమే. అప్పటి పరిస్థితులు, సమీకరణలు వేరు. ఎన్టీయార్ కి ప్రజల్లో సాక్షాత్తు దేవుడి ఇమేజి ఉంది. సినీ పరిశ్రమ మొత్తం ఆయన వెనుక ఉంది. అప్పటితో పోలిస్తే ఓటరు దేవుళ్లకు ఇప్పుడు రాజకీయ చైతన్యం ఎన్నో రెట్లు పెరిగింది. పాతికేళ్ల క్రితంలాగా సినీ గ్లామరు అదే స్థాయిలో ఇప్పుడు ఓట్లు రాలుస్తుందనేది అనుమానమే. అయినా ఓటరు మనసులో ఏముందో ఎవరికెరుక? అందుకే, పైకి డాంబికం ప్రదర్శిస్తున్నా ఆయన పార్టీ ప్రారంభమైన తరువాత తమకు జరగబోయే నష్టంపై తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు రెండూ అంచనాలు వేసుకునే పనిలో ఉన్నాయి.
అతి సర్వత్ర వర్జయేత్ అనేది కెసియార్ వినున్నారో లేదో కానీ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లిచ్చిన షాకుతో అది ఆయనకు అనుభవంలోకొచ్చి ఉంటుంది. చీటికి మాటికీ రాజీనామా మంత్రం అన్ని సార్లూ ఓట్లు రాల్చదనేది ఆయనకిప్పుడు బోధపడి ఉండాలి. పోటీచేసిన 17 స్థానాల్లో సగమైనా గెలవలేకపోవటం, ఓడిన చోట్ల మూడో స్థానానికి పడిపోవటం, రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్ధుల ధరావతు సైతం గల్లంతవటం, స్వయానా కెసియార్ అత్తెసరు మెజారిటీతో గట్టెక్కటం చూస్తుంటే తెరాస పరిస్థితి దయనీయంగా కనిపిస్తుంది. ఆలోచనారహతమైన ఆవేశంతో ఆయన ఇన్నేళ్లుగా కష్టపడి పేర్చుకొచ్చిన తెలంగాణ స్వప్నాన్ని స్వయంగా కూల్చివేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ వాదానికి ఈ ఉప ఎన్నికలు గోరీ కట్టకపోయి ఉండవచ్చుకానీ, తెరాసకు మాత్రం తమ గొయ్యి తాము తీసుకున్నట్లయింది. ఈ దెబ్బనుండి కోలుకోవటానికి కెసియార్ ఇంకొన్ని ఎత్తులు వేసి మరింతగా కష్టాల్లో కూరుకుపోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రమిప్పట్లో సాధ్యపడకవచ్చు. ఆమేరా సమైక్యవాదులకిదో గొప్ప ఊరట.
ఉప ఎన్నికల్లో బాగా లాభపడింది తెలుగుదేశం. ఊహించిన దానికన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటమేకాకుండా అనేక చోట్ల రెండవ స్థానంలో నిలవటం ఆ పార్టీ శ్రేణులకు అత్యంత ఆనందం కలిగించే విషయం. మరోవంక కాంగ్రెస్ విజయాలు ముఖ్యమంత్రి ప్రతిష్టకు ఎంతోకొంత మేలు చేకూర్చేవే.
తెరాస ఎదురుదెబ్బల నేపధ్యంలో ప్రత్యేక తెలంగాణ అనేది వచ్చే సాధారణ ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం కాకపోవచ్చు. అటు రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబు ఇద్దరికీ సొంత పార్టీల్లోని తెలంగాణవాదుల పోరు చాలావరకూ తగ్గినట్లే. అయితే రెండు ప్రధాన పక్షాలకూ ముంచుకొస్తున్న మరో పెద్ద ముప్పు చిరంజీవి. ఆ ముప్పును తప్పించుకోవాలంటే ముఖ్యమంత్రి ముందున్న తేలికైన మార్గం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడటం, తద్వారా చిరంజీవికి తగిన సమయం లేకుండా చేయటం. ఇది తెలుగుడేశానికి కూడా రుచించే పరిణామమే కావచ్చు. తెరాస ప్రాబల్యం క్షీణిస్తున్న ఈ దశలో కాంగ్రెసు – తెలుగుదేశం ఎదురెదురుగా నిలబడి ఎవరేమిటో తేల్చుకోవటానికే మొగ్గు చూపవచ్చు. ఆ విధంగా చూస్తే వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెలల్లో జరగవలిసిన సాధారణ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులోనే జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ప్రస్తుత అసెంబ్లీ ఈ నెలాఖరులోగా రద్దు కావలసి ఉంటుంది. అది జరిగేనా మరి? చూద్దాం, ఏమవుతుందో.
excellant analysis
are you living in AP, if not the state and the people need your guidence there.
Subbarao,
Thank you for the appreciation. About the guidance – there’re far better and more dedicated people in AP doing that already.
మీ విశ్లేషణ చాలా బావుంది.
అభినందనలు.
Meeru vrasina article chala bavundi.Prastutaniki AP paristiti ela vundante, mundu nuyyi(Cong), venaka goyyi( TDP). Evarochina manaki origedemitandi? Chiranjeevi vachina paristiti bagupadutundani cheppalemu.