వార్తాపత్రిక నిత్యావసర వస్తువా!

రాష్ట్రంలో మీడియా యుద్ధం తారాస్థాయిలో ఉంది. ప్రధాన వార్తా పత్రికలయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక వంక, ఈ మధ్యనే వచ్చిన సాక్షి మరో వంక మొహరించి ఒకళ్ల గురించి ఒకరు తిట్లు, వివరణలు, సవరణలు లాంటి వాటితో రోజుకో పేజీ నింపేస్తూ పాఠకులకు కావల్సినంత వినోదం అందజేస్తున్నాయి. మరే రాష్ట్రంలోనన్నా ఇలాంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు. వీళ్ల గొడవలో పార్టీల రాజకీయాలు వెనక్కెళ్లిపోయాయి. వార్తా పత్రికలు ఏదో ఒక పార్టీకి కొమ్ముకాయటం పాత పద్ధతి. ఇప్పుడు పార్టీలే పత్రికల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నాయి.

సాక్షి కాంగ్రెస్ కి కరపత్రం, వాళ్ల రాతలు పట్టించుకోనవసరం లేదు అని చంద్రబాబు ఉద్దేశం. కావచ్చు. ఈనాడు గుంభనంగా తెదేపాని వెనకేసుకొస్తే, కాంగ్రెస్ విషయంలో సాక్షి అదే పని బహిరంగంగా మరింత బరితెగింపుతో చేస్తుంది. జగన్మోహన రెడ్డి ఎంత కాదన్నా ఈ విషయంలో పాఠకులకి ఎలాంటి అనుమానమూ లేదు. సాక్షి ఎందుకు పుట్టిందో తెలియనోళ్లెంతమంది? అయినా, ఆయన పత్రిక ఆయనిష్టం. ఎవరికి అనుకూలంగానన్నా రాసుకుంటాడు. వద్దనటానికి మనమెవరం?

అయితే జగన్మోహనుడు మర్చిపోతున్న విషయమొకటుంది. పార్టీల విషయంలో ఈనాడు విధేయతలెలా ఉన్నా, వార్తా సేకరణ, ప్రచురణల విషయంలో వాళ్లకున్న నిబద్ధతే పాఠకలోకం ఆ పత్రికకు పట్టం కట్టేలా చేసింది. పిచ్చి రాతలు రాసే పత్రికలని నెత్తినెత్తుకోవటానికి జనాలేమీ వెర్రిబాగులోళ్లు కారు. సాక్షి వచ్చీ రావటమే కాంగ్రెస్ కరపత్రంగా ముద్రవేయించుకోవటంపై కాకుండా పత్రిక నాణ్యతా ప్రమాణాలపై దృష్టి పెట్టి ఉంటే రెండు రూపాయకే ఇవ్వటం, అన్నీ రంగుల్లో ముద్రించటం లాంటి తాయిలాల అవసరం ఉండేది కాదు.

విడ్డూరమేమిటంటే, రాష్ట్రంలో ఎండలతో పోటీపడుతూ అన్ని సరుకుల ధరలూ మండిపోతుంటే ఆ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యాసాలు ప్రచురించటంపోయి అన్ని దిన పత్రికలూ తమలాగే రెండు రాపాయలకే ఇవ్వాలని సాక్షి దిన పత్రిక ఉద్యమం మొదలెట్టటం! ఇప్పటికే ‘రెండు రూపాయలకే కిలో పేపరు’ గా ముద్రపడిపోయింది సాక్షికి. ఇలాంటి ఉద్యమాలతో జనాలకి ఒరిగేదేమిటి? ఎవరికే ధర గిట్టుబాటవుతుందో ఆ ధరకి అమ్ముకుంటారు. పాఠకులు కూడా తమకేది ఇష్టమయితే అది కొని చదువుతారు. అయినా జగన్ అమాయకత్వం కాకపోతే, సాక్షి వల్ల ఈనాడు కోల్పోయిన సర్క్యులేషన్ పదిశాతం కూడా లేదని వార్తలొస్తున్న నేపధ్యంలో, ‘ఆ రెండు పత్రికలు’ కూడా జగన్ కోరినట్లు రెండు రూపాయలకే ఇవ్వటం మొదలెడితే ఇక సాక్షిని ఎవరు కొంటారు? అప్పుడు ఉచిత విద్యుత్తు లాగా ఉచిత పేపరు పధకం ఏమన్నా మొదలెడతారా?

4 స్పందనలు నుండి “వార్తాపత్రిక నిత్యావసర వస్తువా!” కు


  1. 1 vijayawada 11:24 పూర్వాహ్నం వద్ద మే 14, 2008

    Mee analysis chala bagundi…meru cheppinatu enka one year taruvatha sakshi free paper..eppudu waste paper

  2. 2 Anonymous 4:44 అపరాహ్నం వద్ద మే 17, 2008

    oddu aniceppinaa balavantangaa sakshi paper vesi potunnaaru.

  3. 4 meeruchadivaaraa 11:37 అపరాహ్నం వద్ద జూన్ 3, 2008

    “ఈనాడు గుంభనంగా తెదేపాని వెనకేసుకొస్తే” Who told you that Eenadu is backing TDP very discreetly? Are you not in AP? Sir, please read newspapers with a proper perspective. otherwise you will be fooled with all these great viewspapers in Telugu. Just this is like గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే.


ప్రత్యుత్తరమిమ్ము




ఆరంభం

08 మే 08


వీక్షణలు

  • 53,521

నా మాట

నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.